
న్యూఢిల్లీ: టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని తప్పించడాన్ని భారత మాజీ క్రికెటర్ మదన్లాల్ తప్పుబట్టాడు. వైట్ బాల్ క్రికెట్లో ఇద్దరు కెప్టెన్లు ఉంటే ఏమవుతుందని ప్రశ్నించాడు. ఓ బలమైన జట్టును నిర్మించాలంటే కష్టం కానీ.. నాశనం చేయడం ఎంతసేపని అసహనం వ్యక్తం చేశాడు. ఇక సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన టెస్ట్ టీమ్ను ప్రకటించిన సెలెక్షన్ కమిటీ.. వన్డే, టీ20 కెప్టెన్గా రోహిత్ శర్మ కొనసాగుతాడని తెలిపింది. అయితే కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం బీసీసీఐ తీరును తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో మదన్లాల్ హిందూస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. బీసీసీఐ తీరును తప్పుబట్టాడు.
'అసలు సెలెక్టర్లు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. విరాట్ కోహ్లీ భారత జట్టుకు విజయాలందిస్తున్నప్పుడు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాల్సిన అవసరం ఏం ఉంది.? టీ20 సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ ఎందుకు తప్పుకున్నాడో అర్థం చేసుకోగలను. వన్డే, టెస్ట్ ఫార్మాట్లపై మరింత ఫోకస్ పెట్టేందుకే కోహ్లీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ వరకు విరాట్ కోహ్లీనే కెప్టెన్గా ఉంటాడనుకున్నా. విజయాలందిస్తున్నా వేటు వేసారంటే.. అది పనిగట్టుకొని చేసిన పనేనని అర్థం చేసుకోవచ్చు. ఓ బలమైన జట్టును నిర్మించాలంటే చాలా కష్టం. కానీ నాశనం చేయడం చాలా సులువు.'అని మదన్లాల్ సెలెక్టర్ల తీరును తప్పుబట్టాడు.
వైట్ బాల్ క్రికెట్లో ఇద్దరు కెప్టెన్లు ఉండటం మంచిది కాదనే ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ వివరణ ఇచ్చాడు. 'విరాట్ స్థానంలో రోహిత్కు కెప్టెన్సీ ఇవ్వడమనేది బోర్డు సెలెక్టర్లు కలిసి తీసుకున్న నిర్ణయం. నిజానికి టీ20 కెప్టెన్సీ వదులుకవద్దని విరాట్ను మేం చాలా రిక్వెస్ట్ చేశాం. కానీ కోహ్లీ మా మాటకు ఒప్పుకోలేదు. దాంతో పరిమిత ఓవర్ల క్రికెట్కు ఇద్దరు కెప్టెన్లు ఉండటం సరికాదని సెలెక్టర్లు భావించారు. వన్డే, టీ20లకు వేర్వేరు లీడర్లు ఉండటం కన్ఫ్యూజన్కు దారి తీస్తుందనుకున్నారు. అందుకే ఒకే కెప్టెన్ ఉంటే మంచిదని.. రోహిత్ను కెప్టెన్ చేశారు. టెస్ట్ జట్టుకు విరాట్ కెప్టెన్గా కొనసాగుతాడు. ఈ విషయాలపై బోర్డు ప్రెసిడెంట్గా నేను, సెలెక్షన్ కమిటీ చైర్మన్ కూడా కోహ్లీతో పర్సనల్గా మాట్లాడాం. పూర్తి వివరాలు చెప్పలేను గానీ రోహిత్ను వైట్ బాల్ కెప్టెన్ చేయడానికి ప్రధాన కారణం మాత్రం ఇదే. అందుకు విరాట్ కూడా ఒప్పుకున్నాడు.'అని దాదా చెప్పుకొచ్చాడు.
అయితే గంగూలీ వాదనను కూడా మదన్లాల్ వ్యతిరేకించాడు. కోహ్లీ టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పుడు.. టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్గా ధోనీ దాదాపు రెండేళ్లు పాటు కొనసాగాడని మదన్లాల్ గుర్తు చేశాడు. 'ఎందుకు గందరగోళం ఏర్పడుతుందో నాకు అర్థం కాలేదు. ప్రతి కెప్టెన్కు ఒక్కో స్టైల్ ఉంటుంది. కాబట్టి గందరగోళం దేనికి. టెస్ట్ క్రికెట్కు, పరిమిత ఓవర్ల క్రికెట్కు చాలా తేడా ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్లను నడిపించడంలో తమదైన శైలిని కలిగి ఉన్నారు. ధోనీ కూడా తనదైన శైలిలో జట్టును నడపించాడు. అన్నిటి కంటే అంతర్జాతీయ స్ధాయిలో ఆడూతూ రాణించడం గొప్ప విశేషం" అని మదన్లాల్ చెప్పుకొచ్చాడు.