ఓడిపోతున్నామనే ఫ్రస్టేషన్లోనే కోహ్లీ నోరుపారేసుకున్నాడు: లుంగి ఎంగిడి

కేప్టౌన్: ఓడిపోతున్నామనే అసహనం టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీలో కనిపించిందని, అందుకే అతను అలా నోరుపారేసుకున్నాడని సౌతాఫ్రికా స్టార్ పేసర్ లుంగి ఎంగిడి అన్నాడు. మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గర్ రివ్యూపై దుమారం రేగిన విషయం తెలిసిందే. అశ్విన్ బౌలింగ్లో ఎల్గర్ తొలుత ఎల్బీడబ్ల్యూగా ఔటైనట్లు అంపైర్ ప్రకటించినా రివ్యూలో బంతి వికెట్లకుపై నుంచి వెళ్తుందని నాటౌట్గా పేర్కొన్నారు.
దాంతో విరాట్ కోహ్లీతో పాటు రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్ తీవ్ర అసహనానికి గురయ్యారు. కోహ్లీ, అశ్విన్ అయితే స్టంప్ మైక్స్ వద్దకు వెళ్లి అధికారిక బ్రాడ్కాస్టర్ సూపర్ స్పోర్ట్పై నోరుపారేసుకున్నారు

సహనం కోల్పోయిన కోహ్లీ..
'బంతికి మెరుగు పెడుతున్నపుడు.. కేవలం ప్రత్యర్థి పైనే కాదు మీ జట్టుపైనా దృష్టి పెట్టాలి. ఎప్పుడూ ప్రత్యర్థి ఆటగాళ్లను పట్టుకోవాలని చూస్తారు'కోహ్లీ మండిపడగా.. 'పదకొండు మందికి వ్యతిరేకంగా దేశం మొత్తం ఉంది'అని కేఎల్ రాహుల్ అనడం వినిపించింది. 'సూపర్స్పోర్ట్.. మీరు గెలవాలంటే మెరుగైన మార్గాన్ని ఎంచుకోండి'అని అశ్విన్ మాట్లాడాడు. అంపైర్ ఎరాస్మస్ కూడా బంతి అలా ఎలా మిస్సవుతుందని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అయితే అంపైర్ తప్పిదం చేసినా భారత ఆటగాళ్లు అలా సహనం కోల్పోవడం బాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఒత్తిడిలో కూరుకుపోయి..
ఇక మైదానంలో చోటు చేసుకున్న ఈ హీట్ మూమెంట్స్పై మ్యాచ్ అనంతరం సౌతాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి స్పందించాడు. టీమిండియా ఒత్తిడిలో కూరుకుపోయిందని, అందుకే ఎల్గర్ విషయంలో తీవ్ర అసహనం ప్రదర్శించిందని ఎంగిడి తెలిపాడు. 'భారత ఆటగాళ్లు ఇలా స్పందించడం ద్వారా ఎంత ఒత్తిడికి గురవుతున్నారో, ఎంత అసహనానికి లోనయ్యారో తెలుస్తోంది. కొన్నిసార్లు ఇలాంటి వాటితో ఆయా జట్లు లబ్ధిపొందుతాయి. ఎవరూ తమ భావోద్వేగాలను తీవ్రంగా ప్రదర్శించాలనుకోరు.

భావోద్వేగాలను అదుపుచేసుకోలేక..
కానీ, ఇక్కడ టీమిండియా ఏమోషన్స్ చాలా కనిపించాయి. దీంతో వాళ్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని అర్థమవుతోంది. ఎల్గర్, పీటర్సన్ నెలకొల్పిన భాగస్వామ్యం మా జట్టుకెంతో ఉపయోగకరం. దాంతో వాళ్లు ఆ భాగస్వామ్యానికి తెరదించాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ల భావోద్వేగాలను అదుపుచేసుకోలేకపోయారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకరకంగా స్పందిస్తారు. అయితే, ఆ సమయంలో టీమిండియా ఆటగాళ్లు ఎలా ఉన్నారో అదే మనం చూశాం. ఓడిపోతున్నామనే అసహనం వారిలో కనిపించింది' అని ఎంగిడి చెప్పుకొచ్చాడు.

విజయం దిశగా సౌతాఫ్రికా..
ఈ మ్యాచ్లో టీమిండియా కష్టాల్లో పడింది. బ్యాట్స్మెన్ అట్టర్ ఫ్లాఫ్ అవడంతో తక్కువ స్కోర్కే పరిమితమైన కోహ్లీసేన ప్రత్యర్థి ముందు సునాయస లక్ష్యాన్ని నిర్దేశించింది. రిషబ్ పంత్ ( 139 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 100 నాటౌట్) శతకంతో చెలరేగినా.. మిగతా బ్యాట్స్మెన్ విఫలమవడంతో భారత్ 198 పరుగులకే కుప్పకూలింది. దాంతో 13 పరుగుల ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని సౌతాఫ్రికా ముందు 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 48 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 155 రన్స్ చేసింది. ఆ జట్టు విజయానికి ఇంకా 57 పరుగులే అవసరం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications