ఐపీఎల్ 2026 వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్.. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండా ఇంటిదారి పట్టడంపై టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతను జట్టు సపోర్ట్ స్టాఫ్ను మార్చాలని టీమ్ మేనేజ్మెంట్ను ఆదేశించినట్లు తెలుస్తోంది.
లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్తో పాటు టీమ్ కన్సల్టెన్సీ జహీర్ ఖాన్పై వేటు వేసేందుకు ఆ జట్టు సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బౌలింగ్ కోచ్గా భరత్ అరుణ్ను లక్నో నియమించుకుంది. జహీర్ ఖాన్ స్థానంలో కొత్త కన్సల్టెంట్ కోసం అన్వేషణ మొదలు పెట్టినట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి.

ఐపీఎల్ 2022 సీజన్లో లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్..ఇప్పటి వరకు 4 సీజన్లు ఆడింది. ఇందులో రెండు సార్లు ప్లే ఆఫ్స్ చేరింది. ఈ రెండు సార్లు టీమ్ మెంటార్గా గౌతం గంభీర్ ఉన్నాడు. ముందు గంభీర్.. ఆ తర్వాత కేఎల్ రాహుల్ జట్టును వదిలేసారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషభ్ పంత్ను రూ. 27 కోట్ల రికార్డ్ ధరకు లక్నో కొనుగోలు చేసింది. కానీ అతను మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఆఖరి మ్యాచ్లో సెంచరీ సాధించాడు. గంభీర్ తర్వాత లక్నో కన్సల్టెంట్గా జహీర్ ఖాన్ బాధ్యతలు చేపట్టాడు. అతని పర్యవేక్షణలో జట్టు ప్లే ఆఫ్స్కు చేరలేకపోయింది.
మరోవైపు సంజీవ్ గోయెంకా లక్నో ఫ్రాంచైజీ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. సౌతాఫ్రికా 20 లీగ్, హండ్రెడ్ లీగ్తో పాటు ఫుట్బాల్ లీగ్స్లో గోయెంకా గ్రూప్ పెట్టుబడులు పెట్టింది. దాంతో ఈ మూడు క్రికెట్ జట్లను చూసుకునేందుకు ఒకే కన్సల్టెంట్ను నియమించుకోవాలని గోయెంకా నిర్ణయించుకున్నారు. దాంతోనే జహీర్ ఖాన్కు ఉద్వాసన పలికి కొత్త కన్సల్టెంట్ కోసం అన్వేషణ ప్రారంభించారు. జహీర్ ఖాన్పై వేటు వేయడాన్ని ఆ జట్టు వర్గాలు ధ్రువీకరించాయి. సంజీవ్ గోయెంకా డబ్బులు బాగా ఖర్చు పెట్టినా.. తక్షణ ఫలితాలను ఆశిస్తాడు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్.. గోయెంకా నుంచి ఇబ్బందులు ఎదుర్కొని జట్టును వీడాడు. హెడ్ కోచ్తో పాటు జహీర్ ఖాన్ స్థానంలో ఎవర్నీ తీసుకుంటాడా? అనేది చర్చనీయాంశంగా మారింది.