ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ, లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రతి గొడవపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దిగ్వేష్ రతిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైన్ విధించినా.. మందలించినా.. దిగ్వేష్ రతికి బుద్ది రాలేదని కామెంట్ చేస్తున్నారు.
అసలేం జరిగిదంటే..?
దిగ్వేష్ రతి వేసిన 8వ ఓవర్లో అభిషేక్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 59)ను క్యాచ్ ఔట్ చేశాడు. ఈ ఓవర్ మూడో బంతిని భారీ షాట్ ఆడే క్రమంలో అభిషేక్ శర్మ వికెట్ పారేసుకున్నాడు. సెట్ అయిన బ్యాటర్ ఔటవ్వడంతో దిగ్వేష్ రతి వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు. తన ట్రేడ్ మార్క్ సిగ్నేచర్ స్టైల్ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ క్రమంలో కాస్త ఓవర్గా రియాక్ట్ అయిన దిగ్వేష్.. బయటికి వెళ్లిపోవాలంటూ సైగలు చేశాడు.

ఇది నచ్చని అభిషేక్ శర్మ అతనిపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దిగ్వేష్ రతి కూడా అతనికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అంపైర్లు, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకొని ఇద్దర్నీ అడ్డుకున్నారు. ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించిన ఈ ఇద్దరికి మ్యాచ్ రిఫరీ జరిమానా విధించే అవకాశం ఉంది.
లక్నో భారీ స్కోర్..
ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్లతో 65), ఎయిడెన్ మార్క్రమ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 45) దూకుడుగా ఆడాడు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా(2/28) రెండు వికెట్లు తీయగా.. హర్ష్ దూబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డిలు తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ 18.2 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసి గెలుపొందింది. అభిషేక్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 59) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 35), హెన్రీచ్ క్లాసెన్(28 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 47), కామిందు మెండీస్(21 బంతుల్లో 3 ఫోర్లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ రతి(2/37) రెండు వికెట్లు తీయగా.. విల్ ఓ రూర్కీ, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ తీసారు.