లక్నో: ఐపీఎల్ 2023 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మరో అద్భుత విజయాన్నందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్తో సోమవారం జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో గెలుపొందింది. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై ఆర్సీబీ బౌలర్లు సత్తా చాటారు. ఈ విజయంతో ఫస్టాఫ్లో లక్నో చేతిలో ఎదురైన పరాజయానికి ఆర్సీబీ ప్రతీకారం తీర్చుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులే చేసింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్(40 బంతుల్లో ఫోర్, సిక్స్తో 44), కెప్టెన్ విరాట్ కోహ్లీ(30 బంతుల్లో 3 ఫోర్లతో 31) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్
మూడు వికెట్లు తీయగా.. రవిబిష్ణోయ్, అమిత్ మిశ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. కృష్ణప్ప గౌతమ్కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 19.5 ఓవర్లలో 108 పరుగులకు కుప్పకూలి ఓటమిపాలైంది. కృష్ణప్ప గౌతమ్(23), అమిత్ మిశ్రా(19) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో కర్ణ్ శర్మ, జోష్ హజెల్ వుడ్ రెండేసి వికెట్లు తీయగా.. సిరాజ్, హర్షల్ పటేల్, మ్యాక్స్వెల్, హసరంగా తలో వికెట్ పడగొట్టారు.
షాకిచ్చిన సిరాజ్..: స్వల్ప లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ కైల్ మేయర్స్(0)ను సిల్వర్ డక్గా మహమ్మద్ సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన కృనాల్ హ్యాట్రిక్ బౌండరీలు బాదగా..గ్లేన్ మ్యాక్స్వెల్ అతని జోరుకు బ్రేక్ వేసాడు. పిచ్ నుంచి లభించిన సహకారంతో ఆర్సీబీ బౌలర్లు చెలరేగారు. ఆయూష్ బదోని(4)ని హజెల్ వుడ్ ఔట్ చేయగా.. దీపక్ హుడా(0)ను హసరంగా స్టంపౌట్ చేశాడు.
గౌతమ్ భారీ సిక్స్లు బాదినా..: దాంతో లక్నో పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోయి 34 పరుగులు మాత్రమే చేసింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినీస్(13), నికోలస్ పూరన్(9) భారీ సిక్సర్లతో ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా.. కర్ణ్ శర్మ దెబ్బకొట్టాడు. పూరన్ను క్యాచ్ ఔట్ చేసిన అతను.. స్టోయినీస్ను కూడా క్యాచ్ ఔట్గానే పెవిలియన్ చేర్చాడు. కృష్ణప్ప గౌతమ్(23) రెండు భారీ సిక్సర్లతో ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా.. సబిస్టిట్యూట్ ఫీల్డర్ సోను సూపర్ త్రోకు రనౌట్గా పెవిలియన్ చేరాడు.
రాహుల్ ఆడినా..: రవి బిష్ణోయ్ కూడా(5) కూడా రనౌటవ్వడంతో లక్నో 77 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. నవీన్ ఉల్ హక్(13), అమిత్ మిశ్రా ఆచితూచి ఆడుతూ జట్టు స్కోర్ను 100 పరుగులు ధాటించాడు. నవీన్ ఉల్ హక్ను హజెల్ వుడ్ ఔట్ చేయగా.. గాయపడ్డ రాహుల్ ఆఖరి వికెట్గా బ్యాటింగ్కు వచ్చాడు. చివర్ ఓవర్లో లక్నో విజయానికి 23 పరుగులు అవసరమవ్వగా.. హర్షల్ పటేల్ అమిత్ మిశ్రా(19)ను ఔట్ చేసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.