లక్నో: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే రాహుల్ గాయంతో మైదానం వీడాడు.
మార్కస్ స్టోయినీస్ వేసిన రెండో ఓవర్ చివరి బంతిని డుప్లెసిస్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే ప్రయత్నంలో రాహుల్ గాయపడ్డాడు. బంతికోసం పరుగెడుతుండగానే అతని కుడి కాలు పట్టేయడంతో నొప్పితో రాహుల్ విలవిలలాడాడు. వెంటనే ఫిజియోలు వచ్చి ప్రథమ చికిత్స అందించినా అతను కోలుకోలేకపోయాడు. దాంతో ఫిజియోల సాయంతో కుంటూతు మైదానం వీడాడు. రాహుల్ మైదానం వీడటంతో కృనాల్ పాండ్యా జట్టును నడిపిస్తున్నాడు.

కేఎల్ రాహుల్ గాయం పెద్దది అయితే లక్నో సూపర్ జెయింట్స్తో పాటు టీమిండియాకు బిగ్ షాక్ తగిలినట్లే. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ఆడే భారత జట్టులో రాహుల్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. ప్రధాన వికెట్ కీపర్గా అతన్ని పరగణిస్తున్నారు.
ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ(31), ఫాఫ్ డుప్లెసిస్(34 నాటౌట్) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్కు 62 పరుగులు జోడించిన అనంతరం విరాట్ కోహ్లీ(31)ని రవి బిష్ణోయ్ స్టంపౌట్గా పెవిలియన్ చేర్చాడు.
క్రీజులోకి వచ్చిన అనూజ్ రావత్(9)ను కృష్ణప్ప గౌతమ్ ఔట్ చేయగా.. గ్లేన్ మ్యాక్స్వెల్(4)ను రవి బిష్ణోయ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో ఆర్సీబీ 18 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి ప్రభుదేశాయ్ రాగా.. ఫాఫ్ ఆచితూచి ఆడుతున్నాడు.