
కోల్కతా: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. సరిగ్గా టాస్ వేసే సమయానికి చిరు జల్లులతో కూడి వర్షం ప్రారంభం కావడంతో అంపైర్లు టాస్ను తాత్కలికంగా నిలిపేసారు. అయితే వర్షం ఎక్కువైతే మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే మూడో స్థానంలో నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్ క్వాలిఫయర్2 నేరుగా అర్హత సాధిస్తుంది. దాంతో ఆర్సీబీ అభిమానులు ఆందోళనకు గురవుతున్నాయి.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ పరిసరాల్లో మంగళవారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం పడింది. గత వారం రోజులుగా అక్కడ సాయంత్రం వేళల్లో వర్షం పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే నిన్న ఇదే వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించలేదు. అయితే ఈ రోజు కొన్ని ఓవర్లు మ్యాచ్ జరిగే అవకాశం ఉన్నా.. 5 ఓవర్ల చొప్పున ఆడిస్తారు. ఆఖరి ప్రయత్నంగా కనీసం సూపర్ ఓవర్ ద్వారా విజేతని నిర్ణయించేందుకు ప్రయత్నిస్తారు. అది కూడా సాధ్యం కాకపోతే టోర్నీ నిబంధనల ప్రకారం పాయింట్స్ టేబుల్లో మెరుగ్గా ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ లెక్కన లక్నో ముందడుగు వేయనుంది.
ఐపీఎల్ 2022 సీజన్లో ఇప్పటికే 71 మ్యాచ్లు ముగియగా.. ఒక్క మ్యాచ్ కూడా వర్షం కారణంగా నిలిచిపోలేదు. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య గత వారం చివర్లో జరిగిన మ్యాచ్లో టాస్ తర్వాత కాసేపు వర్షం వచ్చినా.. మ్యాచ్కి మాత్రం అంతరాయం కలగలేదు. ఈరోజు ఒకవేళ వర్షం కురిసినా.. 30 నిమిషాల్లోనే మ్యాచ్కి గ్రౌండ్ రెడీ అయిపోతుంది. ఈడెన్ గార్డెన్స్లో మెరుగైన డ్రైనేజీ సిస్టమ్ ఉంది. అయితే విరాట్ కోహ్లీ ఆడే కీలక మ్యాచ్లకు ఎప్పుడూ వరణుడు అడ్డంకి కలిగిస్తూనే ఉన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్, డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ల్లో కూడా వర్షం కారణంగానే టీమిండియా ఓటమిపాలైంది.
లీగ్ దశలో ఈ రెండు జట్లు ఏప్రిల్ 19న డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఒకే ఒక మ్యాచ్లో తలపడగా.. ఆ మ్యాచ్లో బెంగళూరు టీమ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో.. ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని లక్నో ఆశిస్తుండగా.. ఆ మ్యాచ్లో కనబర్చిన ప్రదర్శనను పునరావృతం చేయాలని బెంగళూరు ఉవ్విళ్లూరుతోంది.