లక్నో: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓవైపు మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండగా.. మరోవైపు ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. నేరుగా విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లిన సదరు అభిమాని.. మోకాళ్లపై కూర్చొని విరాట్ కోహ్లీ కాళ్లు మొక్కాడు.
'విరాట్.. నువ్వే నా దేవుడిని. నీ ఆశీర్వాదం కావాలి'అంటూ కోహ్లీ కాళ్లు మొక్కాడు. సదరు అభిమానిని లేపి హగ్ చేసుకున్న కోహ్లీ.. బయటకు వెళ్లాలని సూచించాడు. కోహ్లీ సూచనలతో బయటకు వచ్చిన సదరు అభిమాని తన జన్మ ధన్యమైందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని మైదానం బయటకు తీసుకెళ్లారు.

విరాట్ కోహ్లీని కలిసాననే సంతోషంలో ఉన్న సదరు అభిమాని తనను ఏం చేసినా సరేననే ఫీలింగ్లో పోలీసులకు లొంగిపోయాడు. సదరు అభిమాని పట్ల కోహ్లీ ప్రవర్తించిన తీరుపై ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కోహ్లీ గొప్ప మనసు చాటుకున్నాడని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులే చేసింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్(40 బంతుల్లో ఫోర్, సిక్స్తో 44), కెప్టెన్ విరాట్ కోహ్లీ(30 బంతుల్లో 3 ఫోర్లతో 31) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు తీయగా.. రవిబిష్ణోయ్, అమిత్ మిశ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. కృష్ణప్ప గౌతమ్కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 77 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. కర్ణ్ శర్మ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, హజెల్ వుడ్, మ్యాక్స్వెల్, హసరంగా తలో వికెట్ తీసారు.