లక్నో: ఐపీఎల్ 2023 సీజన్లో పంజాబ్ కింగ్స్ మరో విజయాన్నందుకుంది. వరుసగా రెండు ఓటముల తర్వాత మళ్లీ విజయాల బాట పట్టింది. లక్నో సూపర్ జెయింట్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించి 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. షారుఖ్ ఖాన్(10 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 23 నాటౌట్) సూపర్ బ్యాటింగ్తో పంజాబ్కు చిరస్మరణీయ విజయాన్నందించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(56 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 74) మినహా అంతా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లో సామ్ కరణ్ మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడా రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, సికిందర్ రాజా తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 19.3 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులు చేసి మరో మూడు బంతులుండగానే విజయాన్నందుకుంది.
సికిందర్ రాజా(41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. మాథ్యూ షార్ట్(22 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 34) విలువైన పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్, యుధ్వీర్ సింగ్, మార్క్వుడ్ రెండేసి వికెట్లు తీయగా.. కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా తలో వికెట్ తీసారు.
పంజాబ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో హాఫ్ సెంచరీ హీరో సికిందర్ రాజాను రవి బిష్ణోయ్ను ఔట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి 12 బంతుల్లో 20 పరుగులు అవసరమవ్వగా.. మార్క్ వుడ్ వేసిన 19వ ఓవర్లో షారుఖ్ ఖాన్ ఓ భారీ సిక్సర్ బాది సింగిల్ తీయగా.. హర్ప్రీత్ బ్రార్ బౌండరీ బాది క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో చివరి ఓవర్లో పంజాబ్ విజయానికి 7 పరుగులు అవసరమయ్యాయి.
కేఎల్ రాహుల్.. బంతిని రవి బిష్ణోయ్కు ఇవ్వగా షారూఖ్ ఖాన్ తొలి బంతికి క్విక్ డబుల్ తీసాడు. రెండో బంతికి షారూఖ్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను దీపక్ హుడా నేలపాలు చేయగా.. రెండు పరుగులు వచ్చాయి. మూడో బంతిని బౌండరీ బాదిన షారూఖ్.. పంజాబ్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. షారూఖ్ ఖాన్ ఇచ్చిన క్యాచ్ను దీపక్ హుడా పట్టి ఉంటే లక్నో సునాయసంగా విజయాన్నందుకునేది.