ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్లోనూ రిషభ్ పంత్(2) తీవ్రంగా నిరాశపరిచాడు. పంజాబ్ కింగ్స్తో లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్లో రిషభ్ పంత్ 5 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బిగించిన ఉచ్చును పసిగట్టలేక పంత్ మూల్యం చెల్లించుకున్నాడు.
గ్లేన్ మ్యాక్స్వెల్ బౌలింగ్లో పంత్ లెగ్ సైడ్ షాట్ ఆడగా.. ఫైన్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న చాహల్ చేతిలోకి బంతి నేరుగా వెళ్లింది. ప్లాన్ ప్రకారమే ఫీల్డ్ సెట్ చేసి మరి ఊరించే బంతితో పంత్ను బోల్తా కొట్టించారు. రిషభ్ పంత్ తాజా వైఫల్యం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. రిషభ్ పంత్ ధర ఎక్కువ.. ఆట తక్కువ అని విమర్శిస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో రిషభ్ పంత్.. ఆల్టైమ్ రికార్డ్ ధర పలికిన విషయం తెలిసిందే. రూ. 27 కోట్ల భారీ ధరకు అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. కానీ అతను మాత్రం మూడు మ్యాచ్ల్లో 0, 15, 2 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు.

రిషభ్ పంత్పై హైయ్యెస్ట్ ప్రైజ్ ట్యాగ్ ఒత్తిడి నెలకొందని కామెంటేటర్లు అభిప్రాయపడుతున్నారు. గతంలోలా రిషభ్ పంత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేవాడని, కానీ ఇప్పుడు ఒత్తిడిలో కనిపిస్తున్నాడని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. వీలైనంత త్వరగా రిషభ్ పంత్ ఫామ్లోకి రావాలని లేకుంటే ఆ జట్టుకు ఇబ్బందవుతుందని అభిప్రాయపడ్డాడు. ఎమ్మెస్కే ప్రసాద్.. లక్నో సూపర్ జెయింట్స్ స్కౌట్గా కూడా పనిచేశారు.
సోషల్ మీడియా వేదికగా పంత్పై ఫన్నీ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. రూ. 27 కోట్లకు 17 పరుగులా? అని సంజీవ్ గోయెంకా అంటున్నట్లు ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. పంత్.. గోయెంకా కొంపముంచుతున్నాడని, మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫ్రాడ్ అని మండిపడుతున్నారు.