లక్నో: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు విఫలమయ్యారు. కెప్టెన్ కేఎల్ రాహుల్(56 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 74) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లో సామ్ కరణ్ మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడా రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, సికిందర్ రాజా తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ తమ ఇన్నింగ్స్ను నిదానంగా ప్రారంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్(29) ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో లక్నో వికెట్ నష్టపోకుండా 49 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ధాటిగా ఆడే క్రమంలోనే కైల్ మేయర్స్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా(2)ను సికిందర్ రాజా ఔట్ చేశాడు. కృనాల్ పాండ్యాతో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో రాహుల్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్కు 48 పరుగులు జోడించిన అనంతరం కృనాల్ పాండ్యా(18)ను ఔట్ చేసిన రబడా.. మరుసటి బంతికే డేంజరస్ నికోలస్ పూరన్(0)ను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చాడు.
రెండు సిక్సర్లతో ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన మార్కస్ స్టోయినీస్(15)ను సామ్ కరణ్ ఔట్ చేయడంతో లక్నో పరుగుల వేగం తగ్గింది. కేఎల్ రాహుల్ను అర్ష్దీప్ సింగ్ ఔట్ చేయగా.. సామ్ కరణ్ వేసిన ఆఖరి ఓవర్లో కృష్ణప్ప గౌతమ్(1), యుధ్వీర్(0) వరుసగా ఔటయ్యారు. యుధ్ వీర్ ఆడిన భారీ షాట్ను షారుఖ్ ఖాన్ బౌండరీ లైన్పై అద్భుతంగా అందుకున్నాడు. దాంతో లక్నో సాధారణ స్కోర్కే పరిమితమైంది.