ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ తమ జోరును కొనసాగిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ విజయం సాధించింది. మంగళవారం లక్నో వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను చిత్తు చేసింది. ముందుగా బౌలింగ్లో నిప్పులు చెరిగిన పంజాబ్.. అనంతరం విధ్వంసకర బ్యాటింగ్తో లక్నోకు ఊహించని షాక్ ఇచ్చింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. యువ బ్యాటర్లు ఆయుష్ బదోని(33 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 41), అబ్దుల్ సమద్(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 27) తో పాటు నికోలస్ పూరన్(30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 44)రాణించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(2/39) రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, గ్లేన్ మ్యాక్స్వెల్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.

అనంతరం పంజాబ్ కింగ్స్ 16.2 ఓవర్లలోనే 2 వికెట్లకు 177 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ప్రభ్సిమ్రాన్ సింగ్(34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 69), శ్రేయస్ అయ్యర్(30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. నెహాల్ వధేరా(25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 43 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ రతి(2/30) రెండు వికెట్లు తీసాడు. పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రభ్సిమ్రాన్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది.
అయ్యర్ విధ్వంసం..
స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఆడుతూ పాడుతూ చేధించింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(8) విఫలమైనా.. ప్రభ్సిమ్రాన్ సింగ్ విధ్వంసకర బ్యాటింగ్తో లక్ష్యాన్ని మరింత చిన్నదిగా మార్చేశాడు. శ్రేయస్ అయ్యర్తో కలిసి లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన తొలి ఓవర్లోనే ఫోర్, సిక్స్ బాది హిట్టింగ్ మొదలు పెట్టిన అతను.. ఆ తర్వాత ఎడా పెడా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో 23 బంతుల్లోనే ప్రభ్సిమ్రాన్ సింగ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా బ్యాట్కు పని చెప్పడంతో పంజాబ్ కింగ్స్ 9.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ను అందుకుంది.
స్టన్నింగ్ క్యాచ్..
సెంచరీ దిశగా సాగిన ప్రభ్సిమ్రాన్ సింగ్.. రవిబిష్ణోయ్, ఆయుష్ బదోని స్టన్నింగ్ క్యాచ్తో పెవిలియన్ చేరాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. నెహాల్ వదేరాతో కలిసి ఇన్నింగ్స్ను కొనసాగించిన శ్రేయస్ అయ్యర్.. బౌండరీల మోత మోగించాడు. నెహాల్ వధేరా సైతం భారీ సిక్స్లు బాదడంతో పంజాబ్ విజయం సులువైంది. అబ్దుల్ సమద్ 17వ ఓవర్ రెండో బంతిని అయ్యర్ లాంగాన్ దిశగా సిక్సర్ బాది విజయలాంఛనంతో పాటు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మ్యాచ్ టర్నింగ్ పాయింట్..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. అర్ష్దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్లోనే డేంజరస్ మిచెల్ మార్ష్(0) గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఆ కాసేపటికే ఎయిడెన్ మార్క్రమ్(28)ను ఫెర్గూసన్ క్లీన్ బౌల్డ్ చేయగా.. రిషభ్ పంత్(2)ను మ్యాక్స్వెల్ ఔట్ చేశాడు.
వరుసగా వికెట్లు పడ్డా.. నికోలస్ పూరన్ తనదైన శైలిలో చెలరేగాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అయితే హాఫ్ సెంచరీకి చేరువైన అతన్ని యుజ్వేంద్ర చాహల్ ఔట్ చేసి నాలుగో వికెట్కు నమోదైన 53 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. రాంగ్ టైమ్లో నికోలస్ పూరన్ ఔటవ్వడం లక్నో పతనాన్ని శాసించింది.
అన్సంగ్ హీరో అర్ష్దీప్ సింగ్..
ఆయుష్ బదోని ఆచితూచి ఆడే ప్రయత్నం చేసినా.. డేవిడ్ మిల్లర్(19)నిరాశపరిచాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో అబ్దుల్ సమద్ భారీ షాట్లతో వేగంగా ఆడాడు. అయితే అతన్నిఅర్ష్దీప్ సింగ్ పెవిలియన్ చేర్చి పంజాబ్ను 171 పరుగులకే పరిమితం చేశాడు. డెత్ ఓవర్లలో అర్ష్దీప్ సింగ్ కీలక వికెట్లు తీయడంతో పాటు కట్టడిగా బౌలింగ్ చేసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్కు అతనే అన్సంగ్ హీరోగా నిలిచాడు.