
రోహిత్ రాణించినా..
169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(8) శుభారంభాన్ని అందించారు. ఇషాన్ కిషన్ నెమ్మదిగా ఆడినా.. రోహిత్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దాంతో పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. కానీ ఏడో ఓవర్లో రాహుల్.. రవి బిష్ణోయ్ను తీసుకురాగా.. ఇషాన్ కిషన్ విచిత్రకర రీతిలో ఔటయ్యాడు.

ఇషాన్ ఔట్తో..
వికెట్లకు దూరంగా బిష్ణోయ్ వేసిన గూగ్లీని ఇషాన్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి అతని బ్యాట్ ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ రైట్ షూస్ తాకి గాల్లోకి లేచింది. ఫస్ట్ స్లిప్గా ఉన్న జాసన్ హోల్డర్ సింపుల్గా బంతిని అందుకున్నాడు.
దాంతో లక్నో ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. కీపర్ షూస్కు తాకేముందు బంతి నేలకు తాకిందా? అనే సందేహంతో అంపైర్లు థర్డ్ అంపైర్ సమీక్ష కోరారు. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్.. బంతి నేలకు తాకలేదని తేల్చి ఔటిచ్చాడు. దాంతో ఇషాన్ కిషన్(9) నిరాశగా పెవిలియన్ చేరాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

విఫలమైన సూర్య..
అనంతరం క్రీజులోకి వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్(3) ఔటవ్వగా.. ఆ కొద్ది సేపటికే కృనాల్ పాండ్యా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన రోహిత్ శర్మ(39) కూడా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(7) కూడా ఔటవ్వడంతో ముంబై 67 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. పొలార్డ్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 2 భారీ సిక్సర్లతో విజయంపై ఆశలు రేకెత్తించాడు.
కానీ జాసన్ హోల్డర్ 18వ ఓవర్ను నిలకడగా వేయడంతో ఒత్తిడికి గురైన తిలక్.. భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. చమీరా వేసిన 19వ ఓవర్లో చమీరా 5 పరుగులే ఇవ్వడంతో ముంబై ఓటమి ఖాయమైంది. చివరి ఓవర్లో 6 బంతుల్లో 39 పరుగులు అవసరమవ్వగా.. కృనాల్ మూడు వికెట్లు తీసి లక్నో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.


Click it and Unblock the Notifications
