ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ) 215 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. కేఎల్ రాహుల్(41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 55), నికోలస్ పూరన్(29 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 75) హాఫ్ సెంచరీలతో సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది.
ఆయుష్ బదోని(10 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో నువాన్ తుషారా(3/28), పియూష్ చావ్లా(3/29) మూడేసి వికెట్లు తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్(0) గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. నువాన్ తుషారా బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
ఈ పరిస్థితుల్లో మార్కస్ స్టోయినీస్(28) దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అతని పియూష్ చావ్లా వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో పవర్ ప్లేలో లక్నో సూపర్ జెయింట్స్ 2 వికెట్లకు 49 పరుగులే చేసింది. క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా(11).. నెహాల్ వధేరా స్టన్నింగ్ క్యాచ్కు వెనుదిరిగాడు. దాంతో లక్నో 69 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్, కేఎల్ రాహుల్తో కలిసి ధాటిగా ఆడాడు. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన పూరన్ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓ వైపు పూరన్ ధాటిగా ఆడగా.. మరోవైపు రాహుల్ యాంకర్ రోల్ పోషించాడు. ఈ క్రమంలో అతను 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ప్రమాదకరంగా మారిన ఈ జోడీని నువాన్ తుషారా విడదీసాడు. పూరన్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 109 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన అర్షద్ ఖాన్ గోల్డెన్ డక్ కాగా.. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో కేఎల్ రాహుల్ వెనుదిరిగాడు. చివర్లో ఆయుష్ బదోని, నికోలస్ పూరన్ దూకుడుగా ఆడటంతో లక్నో 214 పరుగుల భారీ స్కోర్ చేసింది.