ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 145 పరుగుల లక్ష్యాన్నే నమోదు చేసింది. స్లో వికెట్పై లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 144 పరుగులు చేసింది. నెహాల్ వధేరా(41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 46), ఇషాన్ కిషన్(36 బంతుల్లో 3 ఫోర్లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. టీమ్ డేవిడ్(18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 35 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మోహ్సిన్ ఖాన్(2/36) రెండు వికెట్లు తీయగా.. మార్కస్ స్టోయినీస్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసారు. క్లిష్ట పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా డకౌటవ్వడం ముంబై ఇండియన్స్ కొంపముంచింది. బ్యాటర్లపై అనవసర ఒత్తిడి తీసుకొచ్చింది.

నిరాశ పర్చిన రోహిత్ ..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్, బర్త్డే భాయ్ రోహిత్ శర్మ(4) తీవ్రంగా నిరాశపరిచాడు. మోహిసిన్ ఖాన్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన సూర్య భారీ సిక్సర్తో దూకుడు కనబర్చినా.. స్టోయినీస్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేరాడు. ముందుగా అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. కేఎల్ రాహుల్ రివ్యూ తీసుకొని ఫలితం రాబట్టాడు.
రవి బిష్ణోయ్ స్టన్నింగ్ త్రోకు తెలుగు తేజం తిలక్ వర్మ రనౌట్గా వెనుదిరిగాడు. నవీన్ ఉల్ హక్ వేసిన 6వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని నవీన్ ఉల్ హక్.. ఫుల్ లెంగ్త్లో వేయగా తిలక్ వర్మ ప్యాడ్లను తాకింది. దాంతో లక్నో ఆటగాళ్లు ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్ చేయగా.. అయోమయానికి గురైన తిలక్ వర్మ బంతిని చూసుకోకుండా పరుగుకు ప్రయత్నించాడు.

హార్దిక్ పాండ్యా డకౌట్..
నాన్స్ట్రైకర్ ఇషన్ కిషన్ వద్దనడంతో యూటర్న్ తీసుకున్నాడు. కానీ అప్పటికే బంతిని అందుకున్న రవి బిష్ణోయ్ నేరుగా వికెట్లకు త్రో చేశాడు. ఆ మరుసటి బంతికే హార్దిక్ పాండ్యా కూడా గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. నవీన్ ఉల్ హక్ వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ను హార్దిక్ డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ చేతిలో పడింది. దాంతో ముంబై ఇండియన్స్ 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో నెహాల్ వధేరా, ఇషాన్ కిషన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. 53 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని రవి బిష్ణోయ్ విడదీసాడు. ఇషాన్ కిషన్(32)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
ఆ వెంటనే ధాటిగా ఆడుతున్న నెహాల్ వధేరాను మోహిస్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన మహమ్మద్ నబీని మయాంక్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మోహిసిన్ ఖాన్ వేసిన ఆఖరి ఓవర్లో టీమ్ డేవిడ్ రెండు బౌండరీలు బాది జట్టు స్కోర్ను 140 పరుగుల మార్క్ను ధాటించాడు.