చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. కామెరూన్ గ్రీన్(23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 41), సూర్యకుమార్ యాదవ్(20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 33), తిలక్ వర్మ(22 బంతుల్లో 2 సిక్స్లతో 26) రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 182 పరుగులు చేసింది.
ఇంపాక్ట్ ప్లేయర్ నెహాల్ వధేరా(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 23) మెరుపులు మెరిపించాడు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ నాలుగు వికెట్లు తీయగా.. యశ్ థాకూర్ మూడు వికెట్లు, మోహ్సిన్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ(11), ఇషాన్ కిషన్(15) ఇన్నింగ్స్ను ధాటిగానే ప్రారంభించినా.. ఆ జోరును కొనసాగించలేకపోయారు. వరుస ఓవర్లలో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరారు. నవీన్ ఉల్ హక్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రోహిత్ వెనుదిరగ్గా.. ఇషాన్ కిషన్ను యశ్ ఠాకూర్ పెవిలియన్ చేర్చాడు.
క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. దాంతో పవర్ ప్లేలో ముంబై 2 వికెట్లకు 62 పరుగులు చేసింది.
అనంతరం అదే జోరును కొనసాగించిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. సూర్య తన ట్రేడ్మార్క్ షాట్లతో చెలరేగగా.. గత మ్యాచ్ సెంచరీ హీరో కామెరూన్ గ్రీన్ అదే జోరును కొనసాగించాడు.
66 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని నవీన్ ఉల్ హక్ విడదీసాడు. బంతి వ్యవధిలోనే ఇద్దర్నీ పెవిలియన్కు చేర్చాడు. స్లోయర్ బాల్కు సూర్యను ఔట్ చేసిన నవీన్ ఉల్ హక్.. ఆఫ్ కట్టర్తో కామెరూన్ గ్రీన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో క్రీజులోకి వచ్చిన తెలుగుతేజం తిలక్ వర్మ.. టీమ్ డేవిడ్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. భారీ షాట్లతో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
యశ్ థాకూర్ వేసిన హై ఫుల్టాస్కు టీమ్ డేవిడ్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అయితే ఈ బంతిని అంతా నోబాల్గా భావించిగా.. థర్డ్ అంపైర్ మాత్రం ఫెయిర్ డెలవరీగా ప్రకటించి ఔటిచ్చాడు. దాంతో టీమ్ డేవిడ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. క్రీజులోకి వచ్చిన నెహాల్ వధేరతో తిలక్ వర్మ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ నవీన్ ఉల్ హక్ అతన్ని క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
మోహ్సిన్ ఖాన్ వేసిన 19వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించిన జోర్డాన్(4) ఔటవ్వడంతో 6 పరుగులు మాత్రమే వచ్చాయి. యశ్ థాకూర్ వేసిన ఆఖరి ఓవర్లో వధేరా రెండు బౌండరీలతో పాటు ఓ భారీ సిక్సర్ బాదడంతో ముంబై 182 పరుగుల భారీ స్కోర్ చేసింది.