అసలేం జరిగిందంటే..?
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సందర్భంగా రవి బిష్ణోయ్ వేసిన 8వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వికెట్లకు దూరంగా బిష్ణోయ్ వేసిన గూగ్లీని ఇషాన్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతిని అతని బ్యాట్ ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ రైట్ షూస్ తాకి గాల్లోకి లేచింది. ఫస్ట్ స్లిప్గా ఉన్న జాసన్ హోల్డర్ సింపుల్గా బంతిని అందుకున్నాడు.
దాంతో లక్నో ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. కీపర్ షూస్కు తాకేముందు బంతి నేలకు తాకిందా? అనే సందేహంతో అంపైర్లు థర్డ్ అంపైర్ సమీక్ష కోరారు. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్.. బంతి నేలకు తాకలేదని తేల్చి ఔటిచ్చాడు. దాంతో ఇషాన్ కిషన్(9) నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఇషాన్ తీవ్ర అసహనం..
దురదృష్టవశాత్తు ఔటవ్వడంతో ఇషాన్ కిషన్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. మైదానం వీడుతూ బౌండరీ లైన్ను బ్యాట్తో కొట్టుకుంటూ వెళ్లాడు. రోహిత్తో కలిసి చక్కటి ఆరంభాన్ని అందించాలనుకున్న అతని వ్యూహానికి దెబ్బ పడటంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. ప్రస్తుతం ఇషాన్ ఫ్రస్టేషన్కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇక ఇషాన్ చేసిన పనికి మ్యాచ్ రిఫరీ అతనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
పేలుతున్న సెటైర్లు..
ఇక ఇషాన్ కిషన్ ఔటైన తీరు పట్ల అభిమానులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇంత దురదృష్ణం ఉంటే ఏం చేయలేమని, ముంబై ఇండియన్స్తో పాటు ఆటగాళ్లకు ఏది కలిసిరావడం లేదని కామెంట్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ వేలంలో ఇషాన్ కిషన్ను భారీ ధరకు కొనుగోలు చేయడంతో పాటు దరిద్రాన్ని కూడా వెంట తెచ్చుకుందని సెటైర్లు పేల్చుతున్నారు. రోహిత్ శర్మ వైఫల్యానికి ప్రధాన కారణం ఇషాన్ కిషన్ అని విమర్శిస్తున్నారు. అతను ధాటిగా ఆడకపోవడం వల్ల ఒత్తిడికి గురైన భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి రోహిత్ ఔటవుతున్నాడని చెబుతున్నారు.

శతక్కొట్టిన రాహుల్..
ఈ మ్యాచ్లోనూ ముంబైకి ఓటమి తప్పలేదు. బాధ్యతలేని బ్యాటింగ్తో ముంబై 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(62 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లతో 103 నాటౌట్) సెంచరీతో చెలరేగగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
ముంబై బౌలర్లలో రిలే మెరిడిత్, కీరన్ పొలార్డ్ రెండు వికెట్లు తీయగా.. డానియల్ సామ్స్, బుమ్రా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని చవిచూసారు. రోహిత్ శర్మ(31 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 39), తిలక్ వర్మ(27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లు తీయగా.. మోహ్సిన్ ఖాన్, జాసన్ హోల్డర్, రవి బిష్ణోయ్, ఆయుష్ బదోని తలో వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications
