ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆ జట్టు వరుసగా మూడో మ్యాచ్లోనూ ఓటమిపాలైంది. లక్నో సూపర్ జెయింట్స్తో మంగళవారం జరిగిన లో-స్కోరింగ్ గేమ్లో పేలవ బ్యాటింగ్తో 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ దాదాపు తప్పుకుంది.
ఆ జట్టుకు ఇది ఏడో పరాజయం. మరో 4 మ్యాచ్ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ముంబై ఇండియన్స్కు లేదు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 144 పరుగులు చేసింది.
నెహాల్ వధేరా(41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 46), ఇషాన్ కిషన్(36 బంతుల్లో 3 ఫోర్లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. టీమ్ డేవిడ్(18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 35 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మోహ్సిన్ ఖాన్(2/36) రెండు వికెట్లు తీయగా.. మార్కస్ స్టోయినీస్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్య ఛేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసి గెలుపొందింది. మార్కస్ స్టోయినీస్(45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 62) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయిట్జీ, నువాన్ తుషారా తలో వికెట్ తీసారు. ఈ విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్స్ టేబుల్లో మూడో స్థానానికి చేరింది.
శుభారంభం లేదు..
145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన అర్షిణ్ కులకర్ణి(0).. తొలి ఓవర్లోనే గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినీస్తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.
ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. దాంతో పవర్ ప్లేలో లక్నో వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. అయితే నిలకడగా ఆడుతున్న కేఎల్ రాహుల్(28)ను హార్దిక్ పాండ్యా క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. రాహుల్ ఆడిన భారీ షాట్ను బౌండరీ లైన్పై మహమ్మద్ నబీ అద్భుతంగా అందుకున్నాడు.
స్టోయినీస్ హాఫ్ సెంచరీ..
క్రీజులోకి దీపక్ హుడా రాగా.. మార్కస్ స్టోయినీస్ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు దీపక్ హుడా(18)ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్ది సేపటికే భారీ షాట్లతో చెలరేగిన స్టోయినీస్ను మహమ్మద్ నబీ క్యాచ్ ఔట్గా వెనక్కి పంపాడు. క్రీజులోకి వచ్చిన అష్టోన్ టర్నర్(5)ను కోయిట్జీ ఔట్ చేయడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది.
లక్నో విజయానికి 12 బంతుల్లో 13 పరుగులు కావాల్సిన స్థితిలో హార్దిక్ పాండ్యావ వేసిన 19వ ఓవర్లో ఆయుష్ బదోని రనౌటయ్యాడు. దాంతో కాస్త ఉత్కంఠ రేగింది. కానీ నికోలస్ పూరన్ బౌండరీ బాది విజయ సమీకరణాన్ని సులువు చేశాడు. నబీ వేసిన ఆఖరి ఓవర్లో పూరన్ క్విక్ డబుల్, సింగిల్తో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.