చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన ముంబై 81 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఆకాశ్ మధ్వాల్(5/5) సంచలన బౌలింగ్తో లక్నో పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో క్వాలిఫయర్-2కు అర్హత సాధించిన ముంబై.. శుక్రవారం గుజరాత్ టైటాన్స్తో అమీతుమీ తేల్చుకోనుంది.
టోర్నీ ఆరంభంలో కాస్త తడబడిన ముంబై అనంతరం అసాధారణ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్కు దూసుకొచ్చింది. ఎలిమినేటర్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 182 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్(23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 41), సూర్యకుమార్ యాదవ్(20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 33) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

తిలక్ వర్మ(22 బంతుల్లో 2 సిక్స్లతో 26), ఇంపాక్ట్ ప్లేయర్ నెహాల్ వధేరా(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 23) మెరుపులు మెరిపించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్కు తోడుగా .. యశ్ థాకూర్ మూడు వికెట్లు, మోహ్సిన్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నోసూపర్ జెయింట్స్ 16.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. మార్కస్ స్టోయినీస్(27 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 40) మినహా అంతా విఫలమయ్యారు. ముగ్గురు బ్యాటర్లు రనౌటవ్వడం లక్నో పతనాన్ని శాసించింది. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ (5/5) ఐదు వికెట్ల ఘనత అందుకోగా.. క్రిస్ జోర్డాన్, పియూష్ చావ్లా చెరో వికెట్ తీసారు.
భారీ లక్ష్యచేధనకు దిగిన లక్నోసూపర్ జెయింట్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఆకాశ్ మధ్వాల్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ప్రేరక్ మన్కడ్(3) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ వెంటనే కైల్ మేయర్స్(18)ను క్రిస్ జోర్డాన్ ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన మార్క్స్ స్టోయినీస్, కృనాల్ పాండ్యా(8) ఆచితూచి ఆడారు. దాంతో పవర్ ప్లేలో లక్నో రెండు వికెట్లకు 54 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం స్టోయినీస్ అదే జోరు కనబర్చగా.. కృనాల్ పాండ్యాను పియూష్ చావ్లా పెవిలియన్ చేర్చాడు.

ఆకాశ్ మధ్వాల్ వేసిన 10వ ఓవర్లో వరుస బంతుల్లో ఆయూష్ బదోని(1)తో పాటు డేంజరస్ నికోలస్ పూరణ్(0)లను పెవిలియన్కు చేర్చాడు. బదోనిని క్లీన్ బౌల్డ్ చేసిన మధ్వాల్.. పూరణ్ను క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో 74 పరుగులకే లక్నో 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో దీపక్ హుడాతో కలిసి స్టోయినీస్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది.
అయితే క్విక్ డబుల్ తీసే క్రమంలో ఈ ఇద్దరూ ఒకరినొకరు గుద్దుకోవడంతో స్టోయినీస్ రనౌట్గా వెనుదిరిగాడు. తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఆ మరుసటి ఓవర్లోనే రోహిత్ శర్మ స్టన్నింగ్ త్రో.. తో కృష్ణప్ప గౌతమ్(2)ను రనౌట్ చేశాడు. ఆ వెంటనే రవి బిష్ణోయ్(3)ను ఆకాశ్ మధ్వాల్ క్యాచ్ ఔట్ చేయగా.. దీపక్ హుడా సమన్వయ లోపంతో రనౌటయ్యాడు. చివరి వికెట్గా మోహ్సిన్ ఖాన్(0)ను మధ్వాల్ ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.