ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన కేకేఆర్ 98 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. హర్షిత్ రాణా(3/24), వరుణ్ చక్రవర్తీ(3/30) సంచలన బౌలింగ్తో కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసింది. సునీల్ నరైన్(39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్లతో 81) విధ్వంసకర బ్యాటింగ్ చెలరేగగా.. ఫిల్ సాల్ట్(14 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 32), రఘు వంశీ(26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 32) కీలక ఇన్నింగ్స్ ఆడారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్(3/49) మూడు వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్, యుధ్వీర్ సింగ్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 16.1 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. కేఎల్ రాహుల్(25), మార్కస్ స్టోయినీస్(36) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ మూడేసి వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్ తలో వికెట్ తీసారు. ఆండ్రీ రస్సెల్కు ఓ వికెట్ దక్కింది.
236 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ వేసిన రెండో ఓవర్లోనే రమణ్దీప్ సింగ్ స్టన్నింగ్ క్యాచ్కు అర్షిన్ కులకర్ణి(9) పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినీస్తో కలిసి రాహుల్ ఆచితూచి ఆడాడు. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్తో లక్నో పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది.
నిలకడగా ఆడుతున్న రాహుల్ను హర్షిత్ రాణా క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కొద్దిసేపటికే హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న మార్కస్ స్టోయినీస్(36)ని రస్సెల్ పెవిలియన్ చేర్చడంతో లక్నో ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. దీపక్ హుడా(5), నికోలస్ పూరన్(10), ఆయుష్ బోని(15), అష్టన్ టర్నర్(16), కృనాల్ పాండ్యా(5), యద్వీర్ సింగ్(7), రవి బిష్ణోయ్(2) దారుణంగా విఫలమయ్యారు.