ఐపీఎల్ 2024 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్లోనూ విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో సమష్టిగా విఫలమైన లక్నో సూపర్ జెయింట్స్ 33 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్(43 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీతో పాటు కేఎల్ రాహుల్(31 బంతుల్లో 3 ఫోర్లతో 33), నికోలస్ పూరన్(22 బంతుల్లో 3 ఫోర్లతో 32 నాటౌట్), ఆయుష్ బదోని(11 బంతుల్లో 3 ఫోర్లతో 20 నాటౌట్) రాణించారు.

గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, దర్షన్ నల్కండే రెండేసి వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్.. యశ్ ఠాకూర్(5/30), కృనాల్ పాండ్యా(3/11) ధాటికి 130 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓపెనర్ సాయి సుదర్శన్(23 బంతుల్లో 4 ఫోర్లతో 31) మినహా అంతా విఫలమయ్యారు. చివర్లో రాహుల్ తెవాటియా(30) ఒంటరి పోరాటం చేశాడు.
కళ్లు చెదిరే క్యాచ్..
164 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(19) శుభారంభం అందించారు. తొలి వికెట్కు 54 పరుగులు జోడించారు. పవర్ ప్లే చివరి బంతికి గిల్.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే రవి బిష్ణోయ్ కళ్లు చెదిరే క్యాచ్కు కేన్ విలియమ్సన్ ఔటయ్యాడు.
మ్యాచ్ టర్నింగ్ పాయింట్..
నిలకడగా ఆడుతున్న సాయి సుదర్శన్, అరంగేట్ర ప్లేయర్ బీఆర్ శరత్ లను కృనాల్ పాండ్యా ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చి మ్యాచ్ను మలుపు తిప్పాడు. విజయ్ శంకర్(17), దర్శన్ నల్కండే(12) తమ వైఫల్యాన్ని కొనసాగించారు.
డేంజరస్ రషీద్ ఖాన్(0)ను యశ్ ఠాకూర్ ఔట్ చేయగా.. ఉమేశ్ యాదవ్ను నవీన్ ఉల్ హక్ పెవిలియన్ చేర్చాడు. దాంతో గుజరాత్ టైటాన్స్ ఓటమి ఖాయమైంది. రాహుల్ తెవాటియా ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.