లక్నో: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి లక్నో సూపర్ జెయింట్స్ 19.2 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేసింది. 44 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన లక్నోను ఆయూష్ బదోని(33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. దాంతో లక్నో.. ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది.
లక్నో పిచ్ చాలా స్లోగా ఉండి బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉంటుంది. ఇక్కడే సోమవారం జరిగిన మ్యాచ్లో లక్నోపై ఆర్సీబీ 126 పరుగులు కాపాడుకొని గెలుపొందింది.

శుభారంభం లేదు: టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది ఓపెనర్లు కైల్ మేయర్స్(14), మనన్ వొహ్రా(10) పవర్ ప్లేలోనే వెనుదిరిగారు. బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉన్న వికెట్పై చెన్నై బౌలర్లు చెలరేగారు. మొయిన్ అలీ వేసిన నాలుగో ఓవర్లోనే కైల్ మేయర్స్ క్యాచ్ ఔటవ్వగా.. తీక్షణ వరుస బంతుల్లో మనన్ వొహ్రా, కృనాల్ పాండ్యా(0)లను పెవిలియన్ చేర్చాడు. దాంతో పవర్ ప్లేలో లక్నో.. మూడు వికెట్లకు 31 పరుగులు మాత్రమే చేసింది.
ఆదుకున్న బదోని: క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినీస్ను జడేజా స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేయగా.. కరణ్ శర్మ(9)ను మొయిన్ అలీ రిటర్న్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో లక్నో..44 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో నికోలస్ పూరన్(20), ఆయూష్ బదోని జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్కు 59 పరుగులు జోడించారు.
వర్షం రావడంతో: నికోలస్ పూరన్ ఔటైనా.. ఆయూష్ బదోని తనదైన శైలిలో చెలరేగాడు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పతీరణ వేసిన ఆఖరి ఓవర్లో కృష్ణప్ప గౌతమ్(1) క్యాచ్ ఔట్గా వెనుదిరగ్గా.. వర్షం రావడంతో మ్యాచ్కు అంతరాయం కలిగించింది.