లక్నో: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన రిటైర్మెంట్పై కీలక అప్డేట్ ఇచ్చాడు. మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన ధోనీ.. కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. అప్పటి నుంచి ప్రతీ సీజన్ అతనికి చివరిదనే ప్రచారం జరుగుతోంది. ధోనీ కూడా రిటైర్మెంట్పై నాన్చుతూ వచ్చాడు.
ఐపీఎల్ 2020 సీజన్లో ఆఖరి మ్యాచ్ ఆడిన తర్వాత రిటైర్మెంట్పై స్పందిస్తూ.. ఇప్పుడే కాదు(డెఫినట్లీ నాట్'అని బదులిచ్చాడు. 2021 సీజన్లో విజేతగా నిలిచిన అనంతరం 'నేను చేయాల్సింది ఇంకా ఉంది'అని బదులిచ్చాడు. 2022 సీజన్లోనూ రిటైర్మెంట్ గురిచి ప్రశ్నించగా.. 'ఇన్నేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడినందుకు అక్కడి అభిమానులకు సొంత మైదానంలో కృతజ్ఞతలు చెప్పకుండా తప్పుకోవడం సరి కాదు'అని బదులిచ్చాడు.

దాంతో నాలుగేళ్ల తర్వాత హోమ్ అండ్ అవే ఫార్మాట్లో ఐపీఎల్ 2023 సీజన్ జరుగుతుండటంతో ధోనీకి ఇదే చివరి సీజన్ అని అంతా భావించారు. యువ ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా ధోనీకి సెండాఫ్ ఇచ్చేందుకు ప్రతీ మ్యాచ్కు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. మ్యాచ్ ఎక్కడా జరిగినా మైదానాలు పసుపు మయం అవుతున్నాయి. ప్రత్యర్థి ఆటగాళ్ల అభిమానులు కూడా ధోనీ కోసం చెన్నైకే మద్దతు తెలుపుతున్నారు.
ఈ క్రమంలోనే లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ సందర్భంగా హోస్ట్ డానీ మోరిసన్.. ధోనీ రిటైర్మెంట్ గురించి ప్రశ్నించాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ సందర్భంగా.. 'ఇది మీ లాస్ట్ సీజన్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?'అని డానీ మోరిసన్ ప్రశ్నించాడు. 'నా చివరి సీజన్ అని మీరే డిసైడ్ అయ్యారు. నేను కాదు.'అని ధోనీ నవ్వేసాడు. 'అంటే వచ్చే ఏడాది ఆడుతున్నారన్న మాట... వచ్చే ఏడాది ధోనీ మళ్లీ వస్తున్నాడు. ఒకే..'అంటూ డానీ మోరిసన్ జనాలకు తెలిపాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. ధోనీ మరో సీజన్ ఆడుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ధోనీ ఎప్పుడు ఎలా తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడోనని చెప్పడం చాలా కష్టం. 2014లోనే టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పిన ధోనీ.. 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.