
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో 200 క్యాచ్ల మైలు రాయి అందుకున్నాడు. ప్రిటోరియస్ బౌలింగ్లో డేంజరస్ క్వింటన్ డికాక్ ఇచ్చిన క్యాచ్ను అందుకున్న ధోనీ టీ20 క్రికెట్లో 200 క్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనతను అందుకున్న తొలి భారత క్రికెటర్గా ధోనీ గుర్తింపు పొందాడు.
అంతకుముందు బ్యాటింగ్లో మెరుపులు మెరిపించిన ధోనీ టీ20 క్రికెట్లో 7వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్కు ముందు ఈ ఘనతకు 15 పరుగుల దూరంలో నిలిచిన ధోనీ.. వచ్చి రావడంతోనే ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత 2 బౌండరీలు బాది 6 బంతుల్లో 16 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 1617 పరుగులు చేసిన ధోనీ, ఐపీఎల్లో 4,796 పరుగులు చేశారు. ఛాంపియన్స్ లీగ్ వంటి ఇతర టీ20 లీగ్ల్లోనూ కొన్ని పరుగులు చేశాడు. దాంతో టీ20 క్రికెట్లో 7వేల పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్గా ధోనీ చరిత్రకెక్కాడు.
కాగా ధోని కంటే ముందు ఆ ఫార్మాట్లో 7 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రాబిన్ ఊతప్ప ఉన్నారు. కాగా ఈ ఫార్మాట్లో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 10,326 పరుగులు, రోహిత్ శర్మ 9,936, శిఖర్ ధవన్ 8,818, రాబిన్ ఊతప్ప 7,070 పరుగులు చేశారు. ఐపీఎల్లో 16-20 ఓవర్ల మధ్య అత్యధిక సిక్స్లు బాదిన బ్యాట్స్మన్గా కూడా ధోనీ గుర్తింపు పొందాడు. 153 ఇన్నింగ్స్లో 166 సిక్స్లు బాదాడు. ధోనీ తర్వాత ఏబీ డివిలియర్స్(140), పొలార్డ్(137) ఉన్నారు.

రాబిన్ ఊతప్ప(27 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 50) మెరుపు హాఫ్ సెంచరీకి శివమ్ దూబే(30 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతో 49)క్లాస్ ఇన్నింగ్స్ తోడవడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు చేసింది. మొయిన్ అలీ(22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 35), అంబటి రాయుడు(20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 27) విలువైన పరుగులు చేయగా.. చివర్లో మహేంద్ర సింగ్ ధోనీ(6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 16) మెరుపులు మెరిపించాడు. లక్నో బౌలర్లలో ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్లకు తలో రెండు వికెట్లు దక్కాయి.