లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్(49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 63 ) ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో అద్భుత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నాడు. వరుసగా 6 మ్యాచ్ల తర్వాత హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సీజన్ మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధర పలికిన రిషభ్ పంత్.. ఆ హయ్యెస్ట్ ప్రైజ్ ట్యాగ్ ఒత్తిడి ఏమో తెలియదు కానీ ఈ మ్యాచ్కు ముందు ఆడిన 5 ఇన్నింగ్స్ల్లో 0, 15, 2, 2, 21తో తీవ్రంగా నిరాశపరిచాడు.
లక్నో వేదికగా జరుగుతున్న తాజా మ్యాచ్లో స్టార్ బ్యాటర్లు ఎయిడెన్ మార్క్రమ్(6), నికోలస్ పూరన్(8) తీవ్రంగా నిరాశపర్చిన వేళ.. మిచెల్ మార్ష్(30), ఆయుష్ బదోని(22), అబ్దుల్ సమద్(20)తో కలిసి జట్టుకు విలువైన పరుగులు అందించాడు. పిచ్ స్లోగా ఉండటంతో పరుగులు చేసేందుకు లక్నో బ్యాటర్లు తడబడ్డారు. రిషభ్ పంత్ కూడా నెమ్మదిగా ఆడి 42 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

దాంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. పంత్ ఆడకుంటే లక్నో ఈ స్కోర్ కూడా చేసేది కాదు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా(2/24), మతీష పతీరణ(2/45) రెండేసి వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్ చెరో వికెట్ పడగొట్టారు.
నిరాశపర్చిన మార్క్రమ్, పూరన్..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్కు తొలి ఓవర్లోనే బిగ్ షాక్ తగిలింది. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లోనే ఎయిడెన్ మార్క్రమ్(6) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్(8)ను అన్షుల్ కంబోజ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్తో కలిసి మిచెల్ మార్ష్ చెలరేగాడు. ఖలీల్ బౌలింగ్లో మార్ష్ 4, 6 బాదగా.. పంత్ ఓ ఫోర్ కొట్టాడు. దాంతో పవర్ ప్లేలో ఢిల్లీ 2 వికెట్లకు 42 పరుగులే చేసింది. అనంతరం పంత్ ఓ భారీ సిక్సర్ కొట్టగా.. నూర్ అహ్మద్ కట్టడిగా బౌలింగ్ చేశాడు. దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన మిచెల్ మార్ష్ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
బదోనికి రెండు లైఫ్స్
క్రీజులోకి వచ్చిన ఆయుష్ బదోని 2 సిక్సర్లతో పాటు ఓ బౌండరీ బాది దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతనికి మూడు లైఫ్స్ లభించాయి. పతీరణ బౌలింగ్లో అతను క్యాచ్ ఔట్ అవ్వగా.. అది నో బాల్ అయ్యింది. ఇదే ఓవర్లో రెండో బౌన్సర్ కావడంతో అంపైర్లు భుజం హైట్ను మాత్రమే పరిగణలోకి తీసుకొని నో బాల్ ఇచ్చారు. ఆ తర్వాత జడేజా బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోగా.. అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేసిన అతను ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. రివ్యూలో బంతి గ్లౌవ్స్ను తాకినట్లు తేలింది. ఆ తర్వాత ఓ రనౌట్ అవకాశం చేజారింది.
ఆదుకున్న రిషభ్ పంత్..
ఇదే ఓవర్ ఆఖరి బంతికి ఆయుష్ బదోని స్టంపౌటయ్యాడు. అబ్దుల్ సమద్తో కలిసి పంత్ జట్టును ముందుకు నడిపించాడు. సమద్ ఓ భారీ సిక్సర్ బాదగా.. పంత్ పతీరణ బౌలింగ్లో రెండు సిక్స్లు కొట్టి 42 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో సిక్సర్ బాదిన పంత్.. అదే జోరులో ఓ క్యాచ్ ఇచ్చాడు. కానీ షేక్ రషీద్ నేలపాలు చేశాడు. ఆఖరి ఓవర్లో అబ్దుల్ సమద్ రనౌటవ్వగా.. పంత్ క్యాచ్ ఔటయ్యాడు. బౌండరీ బాదిన శార్దూల్ ఠాకూర్.. ఆఖరి బంతికి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో లక్నో 166 పరుగులకే పరిమితమైంది.