లక్నో: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ) యువ బ్యాటర్ ఆయూష్ బదోని (33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉన్న వికెట్పై అసాధారణ బ్యాటింగ్ చేశాడు. 44 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన లక్నో జట్టును నికోలస్ పూరన్తో కలిసి ఆదుకున్నాడు.
ఆరో వికెట్కు 59 పరుగులు జోడించి 126 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. దీపక్ చాహర్ వేసిన 19వ ఓవర్లో మూడో బంతిని భారీ సిక్సర్ బాదిన ఆయూష్ బదోని 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం విరాట్ కోహ్లీలా గాల్లోకి ముద్దులు ఇస్తూ సెలెబ్రేట్ చేసుకున్నాడు. కోహ్లీలా బదోని సంబరాలు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

గౌతమ్ గంభీర్ ప్రియ శిష్యుడిగా ఐపీఎల్లో సత్తా చాటుతున్న బదోని.. కోహ్లీని అనుకరించడం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే బదోని విరాట్ కోహ్లీ వీరాభిమానని, అతని ఆట చూసే పెరగాడని కోహ్లీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం అది కోహ్లీ ఒక్కడి సెలెబ్రేషనే ఎందుకు అయితదని ప్రశ్నిస్తున్నారు.
లక్నో-బెంగళూరు మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ అనంతరం గంభీర్-కోహ్లీ గొడవపడిన విషయం తెలిసిందే. ఈ గొడవ తీవ్ర చర్చనీయాంశం కాగా.. లక్నో-ఆర్సీబీ పోరును అభిమానులు భారత్-పాక్ పోరుగా అభివర్ణిస్తున్నారు. ఈ క్రమంలోనే కోహ్లీకి సంబంధించి లక్నో ఆటగాళ్లు ఏది చేసినా చర్చనీయాంశమవుతోంది.
ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించగా అంపైర్లు ఆటను నిలిపేసారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి లక్నో సూపర్ జెయింట్స్ 19.2 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేసింది. స్లోగా ఉన్న లక్నో వికెట్పై ఈ లక్ష్యం పోరాడదగినదే. ఇక్కడే సోమవారం జరిగిన మ్యాచ్లో లక్నోపై ఆర్సీబీ 126 పరుగులు కాపాడుకొని గెలుపొందింది.