ఐపీఎల్ 2025 సీజన్ను ఓటమితో ప్రారంభించిన లక్నో సూపర్ జెయింట్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గురువారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో వైజాగ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను అనవసర తప్పిదాలతో చేజార్చుకుంది.
ఈ మ్యాచ్లో ఓడినా.. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ లైనప్ భీకరంగానే ఉంది. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ సూపర్ ఫామ్లో ఉన్నారు. ప్రధాన బౌలర్లు అందుబాటులో లేకపోవడంతో ఆ జట్టు డెత్ ఓవర్లలో తడబడింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో విధ్వంసకర బ్యాటింగ్తో భారీ విజయాన్నందుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ ఫుల్ జోష్లో ఉంది.

పరుగుల వరదే..
తొలి మ్యాచ్లోనే 286 పరుగుల భారీ స్కోర్ చేసిన ఆరెంజ్ ఆర్మీ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. దాంతోనే ఇరు జట్ల మధ్య పోరు హోరా హోరీగా సాగనుంది. ఈ మ్యాచ్కు కూడా బ్యాటింగ్ పిచ్ తయారు చేయనుండటంతో మరోసారి పరుగుల వరద పారనుంది. ఇరు జట్ల మధ్య భీకర బ్యాటర్లు ఉండటంతో బౌండరీల వర్షం కురవనుంది.
ఆ స్టార్ పేసర్ రీఎంట్రీ..
ఫిట్నెస్ సమస్యలతో తొలి మ్యాచ్కు దూరమైన లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ పేసర్ ఆవేశ్ ఖాన్ ఈ మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు. దాంతో అతని స్థానంలో తొలి మ్యాచ్ ఆడనున్న ప్రిన్స్ యాదవ్పై వేటు పడనుంది. ఈ ఒక్క మార్పు మినహా లక్నో లైనప్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్ ఆడనుండగా.. నికోలస్ పూరన్, రిషభ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్ మిడిలార్డర్లో ఆడనున్నారు.
స్పిన్ ఆల్రౌండర్గా షెహ్బాజ్ అహ్మద్ ఆడనుండగా.. శార్దూల్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవి బిష్ణోయ్, దిగ్వేష్ రతి ఆడనున్నారు. ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే.. దిగ్వేష్ రతిపై వేటు పడనుంది. మణిమరన్ సిద్దార్థ్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది.
SRHతో.. లక్నో తుది జట్టు (అంచనా): ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్(కీపర్, కెప్టెన్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్ మిడిలార్డర్లో ఆడనున్నారు.