టీమిండియా వికెట్ కీపర్, లక్నో సూపర్ జెయింట్స్ నయా కెప్టెన్ రిషభ్ పంత్పై ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్ చరిత్రలోనే రిషభ్ పంత్ అత్యుత్తమ కెప్టెన్గా నిలుస్తాడని ఆకాంక్షించాడు. అప్కమింగ్ ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్గా రిషభ్ పంత్ వ్యవహరిస్తాడని సంజీవ్ గోయెంకా అధికారికంగా ప్రకటించాడు. కోల్కతా వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో సంజీవ్ గోయెంకా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ కార్యక్రమంలో పంత్ కూడా పాల్గొన్నాడు.
గత సీజన్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా వ్యవహరించిన రిషభ్ పంత్.. మెగా వేలానికి ముందు ఆ జట్టును వీడాడు. గతేడాది నవంబర్లో జరిగిన మెగా వేలంలో రిషభ్ పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్ల ఆల్ టైమ్ రికార్డ్ ధరకు కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్టీఎమ్ కార్డ్ ఉపయోగించడంతో లక్నో భారీ ధరకు బిడ్ వేసి దక్కించుకుంది. అందరూ ఊహించినట్లుగానే అతనికే సారథ్య బాధ్యతలు అప్పగించింది.

దాంతో లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా ఎంపికైన నాలుగో ఆటగాడిగా రిషభ్ పంత్ నిలిచాడు. అతని కన్నా ముందు కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ ఆ జట్టును నడిపించారు. గత సీజన్ వరకు రాహుల్ లక్నోను నడిపించాడు. అతని గైర్హాజరీలో కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్లు సారథ్య బాధ్యతలు చేపట్టారు.
అయితే గత సీజన్ సందర్భంగా సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఎదురైన ఘోర పరాజయంతో తీవ్ర అసహనానికి గురైన సంజీవ్ గోయెంకా.. మైదానంలోనే అందరు చూస్తుండగానే రాహుల్పై గట్టిగా అరిచాడు. ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. ఆ తర్వాత గోయెంకా దిద్దుబాటు చర్యలు చేపట్టినా.. ఆ జట్టులో కొనసాగేందుకు కేఎల్ రాహుల్ ఆసక్తి చూపలేదు. దాంతో ఆ జట్టు భారీ ధరను వెచ్చించి రిషభ్ పంత్ను కొనుగోలు చేసింది.
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు మూడు సీజన్లలో పంత్ సారథిగా వ్యవహరించాడు. ఐపీఎల్ 2021లో ఢిల్లీ టేబుల్ టాపర్గా నిలిచింది. కానీ ఫైనల్ చేరలేకపోయింది. ఐపీఎల్ 2022, ఐపీఎల్ 2024 సీజన్లో మాత్రం దారుణంగా విఫలమైంది. రోడ్డు ప్రమాదంతో పంత్ ఐపీఎల్ 2023 సీజన్ ఆడలేదు. 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన పంత్... అప్పటి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్కే ఆడాడు. 110 మ్యాచులు ఆడి 35.31 సగటుతో 3,284 రన్స్ సాధించాడు. అందులో ఓ శతకం, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.