న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అభిమానుల దెబ్బకు లక్నో సూపర్ జెయింట్స్ కాళ్ల బేరానికి వచ్చింది. ఇక నుంచి గొడవలద్దని రిక్వెస్ట్ చేసింది. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చోటు చేసుకున్న ఘటనలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దాంతో ఇరు జట్ల మధ్య పోరు భారత్-పాక్లా మారింది. ముఖ్యంగా ఆర్సీబీని కించపరుస్తూ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ చేసిన ట్వీట్ గొడవకు ఆజ్యం పోసింది.
బెంగళూరు వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీని ఓడించింది. ఈ గెలుపుతో లక్నో ఆటగాళ్లతో పాటు మెంటార్ గౌతమ్ గంభీర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఆర్సీబీ అభిమానులు సైలెంట్గా ఉండాలని నోటిపై వేలు వేసుకొని సైగలు చేశాడు. లక్నో ఫ్రాంచైజీ కూడా ట్విటర్ వేదికగా.. ప్లే బోల్డ్ అంటే ఇదేనా? అంటూ ఎగతాళి చేసింది.

ఇవన్నీ మనసులో పెట్టుకున్న ఆర్సీబీ టైమ్ కోసం ఎదురు చూసి రీవెంజ్ తీర్చుకుంది. లక్నో వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో అసాధారణ విజయాన్నందుకుంది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు కోహ్లీ.. దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. గంభీర్ చర్యలకు ప్రతీగా.. మీరు సైలెంట్గా ఉండవద్దని, తాను అండగా ఉంటానని తెలిపాడు.
ఈ క్రమంలోనే లక్నో పేసర్ నవీన్ ఉల్ హక్, కోహ్లీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవ కాస్త గంభీర్-కోహ్లీగా మారింది. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దూసుకెళ్లడం చర్చనీయాంశమైంది. ఇద్దరికి మ్యాచ్ రిఫరీ భారీ జరిమానా విధించారు. అప్పటి నుంచి ఆర్సీబీ-లక్నో అంటే భారత్-పాక్ పోరులానే అభిమానులు భావించారు.
లక్నో ఆడిన ప్రతీ మ్యాచ్లోనూ కోహ్లీ అభిమానులు రచ్చ చేశారు. లక్నో ఫ్రాంచైజీకి వ్యతిరేకంగా కోహ్లీ అని అరుస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. నవీన్ ఉల్ హక్ స్వీట్ మ్యాంగోస్ అంటూ కోహ్లీ వైఫల్యంపై సెటైర్లు వేయడంతో గొడవ మరింత పెద్దదైంది. గుజరాత్ టైటాన్స్తో ఆర్సీబీ ఓటమి అనంతరం కూడా నవీన్ ఉల్ హక్.. కోహ్లీని ఉద్దేశించి పోస్ట్ పెట్టాడు.
ఆర్సీబీ అభిమానుల రియాక్షన్తో కాళ్ల బేరానికి వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ గొడవలద్దనీ రిక్వెస్ట్ చేసింది. 'ఇచ్చారు. తీసుకున్నాం. ఇక వదిలేయండి. గొప్పగా పోరాడారు. వచ్చే సీజన్లో కలుద్దాం'అని ట్వీట్ చేశారు.