కొలంబో: లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్)లో పాములు కలకలం సృష్టిస్తున్నాయి. మ్యాచ్లు జరుగుతున్న సమయంలో మైదానాల్లోకి వస్తున్న పాములు ఆటగాళ్లను హడలెత్తిస్తున్నాయి. దంబుల్లా ఔరా-గాలె టైటాన్స్ మధ్య జూలై 31న జరిగిన మ్యాచ్లో ప్రత్యక్షమైన పాము.. శనివారం కొలంబో వేదికగా జరిగిన మరో మ్యాచ్లోను కనిపించి కలకలం రేపింది.
జాప్నా కింగ్స్, బిలవ్ క్యాండీ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో మైదానంలోకి వచ్చిన పాము.. ఆటగాడికి సమీపంగా వెళ్లింది. శ్రీలంక ఆటగాడు ఇసురు ఉడానా తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాడు. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో జాఫ్నా ఇన్నింగ్స్ 18వ ఓవర్లో పాము మైదానంలోకి ప్రవేశించింది.

నువాన్ ప్రదీప్ బౌలింగ్ చేసేముందు ఫీల్డ్ ప్లేస్మెంట్లో మార్పు చేయడంతో ఇసురు ఉడానా పక్కకు జరిగే క్రమంలో పామును తొక్కబోయాడు. అదృష్టవశాత్తు పామును చూసిన అతను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఉడానా దూరంగా వెళ్లగా.. పాము బౌండరీ లైన్ బయట ఉన్న కెమెరాల వద్దకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
ఇసురు ఉడానా ఏ మాత్రం ఎమరుపాటుగా ఉన్నా పాము కాటుకు గురయ్యేవాడు. పెద్ద ప్రమాదమే తప్పిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. భూమి మీద నూకలు బాకీ ఉన్నాయని, ఇసురు ఉడానా పెద్ద గండం తప్పించుకున్నాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మైదానంలో ఆటగాళ్ల ఆటను చూసి నాగినీ డ్యాన్స్ చేసేందుకు పాములు మైదానంలోకి వస్తున్నాయని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.
ఈ మ్యాచ్లో క్యాండీ టీమ్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన క్యాండీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేసింది. అనంతరం జాఫ్నా 170 పరుగులే చేసి ఓటమిపాలైంది.