టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన లవ్ స్టోరీ గురించి చెప్పాడు. తొలి చూపులోనే తన సతీమణి దేవిషా శెట్టిని ఇష్టపడ్డానని తెలిపాడు. అందరి ప్రేమ కథల్లోలానే తనను కూడా దేవిషా శెట్టి ప్రారంభంలో పట్టించుకోలేదన్నాడు. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, అతని సతీమణి గీతా బస్రా హోస్ట్గా వ్యవహరిస్తున్న 'హూస్ ది బాస్?'అనే యూట్యూబ్ చాట్ షోలో తమ ప్రేమకథ గురించి సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తన సతీమణితో కలిసి సూర్య ఈ షోలో పాల్గొన్నాడు. ఈ షో ద్వారా హర్భజన్ సింగ్ దంపతులు.. స్టార్ క్రికెటర్ల దంపతులతో సరదాగా మాట్లాడుతూ.. వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను అభిమానులకు తెలియజేస్తున్నారు.
ఇప్పటికే ఈ షోకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సురేశ్ రైనా సతీసమేతంగా హాజరై అనేక విషయాలు పంచుకున్నారు. తాజాగా సూర్యకుమార్ యాదవ్ కూడా సతీ సమేతంగా హాజరై తన లవ్ స్టోరీ గురించి చెప్పాడు. తన కాలేజీకే చెందిన దేవిషా శెట్టిని 2012లో కామన్ ఫ్రెండ్ ద్వారా తొలిసారి కలిసానని చెప్పిన సూర్య.. తొలి చూపులోనే ఇష్టపడినట్లు పేర్కొన్నాడు. ఆ తర్వాత ఆమె గురించి తెలుసుకొని పరిచయం పెంచుకొని ప్రేమలోకి దించి వివాహం చేసుకున్నానని తెలిపాడు.

'మా కాలేజీ మాజీ స్టూడెంట్ అయిన కామన్ ఫ్రెండ్ ద్వారా 2012లో దేవిషా శెట్టిని తొలిసారి కలిసాను. ఆ రోజు నేను కాలేజీ పిట్ట గోడపై కూర్చున్నాను. దేవిషా కాలేజీ మరోవైపు నుంచి నడుచుకుంటూ వస్తుండగా తొలిసారి చూశాను. ఆమెను చూసిన వెంటనే 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్'అనే ఫీలింగ్ కలిగింది. నా పక్కనే ఉన్న మా ఇద్దరి కామన్ ఫ్రెండ్ మరొకరితో మాట్లాడుతున్నాడు. నేను వెంటనే'బ్రో నేను ఇక్కడ ఉండగా.. ఎవరితో మాట్లాడుతున్నావ్?'అని అన్నాను. ఆ సమయంలో దేవిషా మా వైపు రావడం నేను గమనించాను. ఆ సమయంలో ఆమెతో మాట్లాడాలనే ఆతృత కలిగింది.
ఆ తర్వాత మా కామన్ ఫ్రెండ్ దేవిషా దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. నేను వెంటనే అతని దగ్గరకు వెళ్లి "ఏం చేస్తున్నావు, కనీసం నన్ను ఆమెకు పరిచయం చెయ్యి" అని అడిగాడు. దేవిషా మాత్రం నన్ను పట్టించుకోకుండా మా ఫ్రెండ్తో మాట్లాడి వెళ్లిపోయింది. ఆ తర్వాత కష్టపడి ఆమె వివరాలను తెలుసుకున్నాను. కామన్ ఫ్రెండ్ ద్వారా దేవిషా బీబీఎమ్ పిన్ సంపాదించాను.'అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.

ఆ వెంటనే దేవిషా మాట్లాడుతూ.. 'సూర్యకుమార్ యాదవ్ నాకు మెసేజ్ చేశాడు. కానీ నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత అతను ఫెస్ బుక్ ద్వారా మెసేజ్ చేశాడు. కొన్నాళ్లు చాటింగ్ చేసుకున్నాం. ఆ తర్వాత స్కైప్ ద్వారా వీడియో కాల్స్లో మాట్లాడుకున్నాం . ఆ సమయంలో సూర్యకుమార్ యాదవ్ గురించి నాకు పెద్దగా తెలియదు. అప్పుడు అతను అంత పాపులర్ కూడా కాదు. కాలేజీ రోజుల నుంచి జీవితం ఈ స్థాయికి వస్తుందని అస్సలు ఊహించలేదు. ముంబై ఇండియన్స్తోనే అతను క్రికెటర్గా ఎదిగాడు. అయితే సడెన్గా సూర్యకు సక్సెస్ రాలేదు. అతను ఎంతో కష్టపడ్డాడు'అని దేవిషా శెట్టి చెప్పుకొచ్చింది. 2012 నుంచి ప్రేమించుకున్న సూర్య, దేవిషాలు 2016లో వివాహం చేసుకున్నారు. పెళ్లై 9 ఏళ్లు అవుతున్నా వీరకి పిల్లలు లేరు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు సూర్య, దేవిషాలు స్పందించలేదు.