జాతీయ క్రీడా పరిపాలన బిల్లు (ఎన్ఎస్జీబీ)కు మోక్షం లభించింది. బిహార్ ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాల నిరసనల మధ్యే సోమవారం క్రీడా బిల్లును లోక్సభ ఆమోదించింది. స్వాతంత్య్రం తర్వాత భారత క్రీడా రంగంలో తీసుకొచ్చిన అతి పెద్ద సంస్కరణ ఈ బిల్లు అని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. అలాగే జాతీయ డోపింగ్ నిరోధక (ఎన్ఏడీ) సవరణ బిల్లుకూ లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనల కారణంగా తొలుత వాయిదా పడిన లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభం కాగానే క్రీడా బిల్లుకు ఆమోదం లభించింది.
'స్వాతంత్య్రం వచ్చాక క్రీడల్లో ఇదే అతి పెద్ద సంస్కరణ. క్రీడా సమాఖ్యల్లో జవాబుదారీతనం, అథ్లెట్లకు న్యాయం చేకూర్చడంతో పాటు ఉత్తమ పరిపాలనను ఈ బిల్లు అందిస్తుంది. 2036 ఒలింపిక్స్కు బిడ్ దాఖలు చేయాలనే లక్ష్యానికి ఈ బిల్లు ఉపయోగకరంగా ఉంటుంది. భారత క్రీడా వ్యవస్థలో ఈ బిల్లుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంత కీలకమైన బిల్లు, సంస్కరణలో ప్రతిపక్షాల భాగస్వామ్యం లేకపోవడం దురదృష్టకరం'అని మాండవ్య తెలిపారు.
