
హైదరాబాద్: టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఖాతాలో మరో టైటిల్ చేరింది. ఐపీఎల్లో కోల్కత్తా నైట్రైడర్స్ను రెండు సార్లు ఛాంపియన్గా నిలిపిన గౌతమ్ గంభీర్, కెప్టెన్గా మరో జట్టును ఛాంపియన్గా నిలబెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్కు దూరమై చాలా రోజులవుతున్నా.. తన సారథ్యంలోని సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఓ మాజీ క్రికెటర్గా తరుచూ.. ఆయా జట్ల కెప్టెన్లను విమర్శించే గంభీర్.. మాటలు చెప్పడం కాదు ఆడి గెలవడం కూడా వచ్చని యువ ఆటగాళ్లకు తన విజయంతో చాటి చెప్పాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పించిన గంభీర్.. తన దృష్టిలో టైటిల్ సాధించలేని వాడు గొప్ప కెప్టెనే కాదని చెబుతుంటాడు.
ఐపీఎల్ తరహాలో అలనాటి ఆటగాళ్లతో జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ రెండో ఎడిషన్ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ సీజన్ లెజెండ్స్ లీగ్ క్రికెట్లో గౌతమ్ గంభీర్ సారథ్యంలోని ఇండియా క్యాపిటల్స్ విజేతగా నిలిచింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రాస్ టేలర్ (41 బంతుల్లో 4ఫోర్లు, 8 సిక్స్లతో 82), మిచెల్ జాన్సన్ (35 బంతుల్లో 7ఫోర్లు, 3సిక్స్లతో 62), ఆష్లే నర్స్ (19 బంతుల్లో 6ఫోర్లు, 1సిక్స్లతో 42 నాటౌట్) చెలరేగడంతో బిల్వారా కింగ్స్ను 104 పరుగుల తేడాతో ఇండియా క్యాపిటల్స్ చిత్తు చేసింది. మొదట గంభీర్ సేన 20 ఓవర్లలో 7 వికెట్లకు 211 పరుగుల భారీస్కోరు సాధించింది. 21 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న జట్టుకు భారీస్కోరు అందించిన ఘనత టేలర్, జాన్సన్, నర్స్లదే.
టేలర్, జాన్సన్ అయిదో వికెట్కు 126 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. బిల్వారా బౌలర్లలో రాహుల్శర్మ (4/30), మాంటీ పనేసర్ (2/13), టిమ్ బ్రెస్నన్ (1/11) సఫలమయ్యారు. అనంతరం బిల్వారా కింగ్స్ 18.2 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో షేన్ వాట్సన్ (27; 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్లతో) అత్యధిక స్కోరర్. క్యాపిటల్స్ బౌలర్లలో జాన్సన్ (1/26), పవన్ సుయాల్ (2/27), ప్రవీణ్ తంబె (2/19), ప్లంకెట్ (1/15), పంకజ్సింగ్ (2/14), రజత్ భాటియా (1/2) రాణించారు.