గిల్కు అన్యాయమేనా?
మొదటగా రాహుల్ ప్రభావం శుభ్మన్ గిల్పై పడనుంది. వెస్టిండీస్తో ఆడిన మూడు మ్యాచ్ల్లో గిల్ వరుసగా 64, 43, 98 స్కోర్లతో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. హయ్యెస్ట్ రన్ స్కోరర్గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు. దాంతో జింబాబ్వే పర్యటనలో గిల్ ఓపెనర్గా ఆడటం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మరో ఆలోచనతో ముందుకొచ్చాడు. ఈ సిరీస్కు దూరంగా ఉన్నా అతను ఇచ్చిన బ్లూ ప్రింట్నే వీవీఎస్ లక్ష్మణ్ అమలు చేయనున్నాడు. దాంతో గిల్కు బదులు రాహుల్ ఓపెనింగ్ చేయడం ఖాయమైపోయింది.
బ్యాకప్ ఆఫ్సన్స్ కోసమే..
అయితే రాహుల్ కోసం గిల్ను లైనప్లో కిందకు తీసుకొస్తారా? దీనివల్ల ఎవరికి లాభం జరుగుతుందనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.'గిల్ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ సరైన దిశలోనే వెళ్తున్నది. కరీబియన్ సిరీస్లో బాగా ఆడినప్పటికీ టీమ్ వ్యూహాలు భిన్నంగా ఉన్నాయి. ఒక స్లాట్కు అనేక ప్రత్యామ్నాయాలను సిద్ధం చేయాలని మేనేజ్మెంట్ టార్గెట్గా పెట్టుకుంది. అందులో భాగంగానే గిల్ను మూడో ప్లేస్కు సిద్ధం చేస్తున్నారు' అని మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ పేర్కొన్నాడు.
భవిష్యత్తు గిల్దే..
గాంధీ వ్యాఖ్యలతో ఏకీభవించిన మాజీ ప్లేయర్ దీప్దాస్ గుప్తా మరో కోణాన్ని వెల్లడించాడు. 'ఓ మంచి సిరీస్ తర్వాత గిల్ను లైనప్లో తగ్గించడం నిజంగా కష్టమే. కానీ రాహుల్ను ఆసియా కప్లో ఓపెనింగ్కు సిద్ధం చేయడమే మేనేజ్మెంట్ ముందున్న లక్ష్యం. అతను కుదురుకోవడానికి చాలా టైమ్ కావాలి. అందుకే మూడు మ్యాచ్ల్లో రాహుల్కు తగ్గినంత టైమ్ను కేటాయిస్తున్నది. గిల్ను పక్కనబెట్టడం తాత్కాలికమే అనుకుంటున్నా. గిల్ ఓపెనింగ్లో ఇలాగే ఆడితే కచ్చితంగా వన్డే వరల్డ్కప్ టీమ్లో చోటు సంపాదిస్తాడు' అని దాస్ గుప్తా వివరించాడు.
ప్రాక్టీస్ షురూ..
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం జింబాబ్వేకు చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ ప్రారంభించింది. ఆదివారం జరిగిన తొలి సెషన్లో రుతురాజ్, దీపక్ చహర్ నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. కోచ్ లక్ష్మణ్ ఈ సెషన్ను పర్యవేక్షించాడు. తేలికపాటి కసరత్తులు చేసిన ప్లేయర్లు తర్వాత ఫీల్డింగ్ ప్రాక్టీస్లో మునిగిపోయారు. సిరాజ్, చహర్, ప్రసిధ్ బౌలింగ్ను సరిచూసుకున్నారు.