
న్యూఢిల్లీ: ఫుట్బాల్ దిగ్గజం, ఫిఫా ప్రపంచకప్ విజేత, ఆల్టైమ్ గ్రేట్ లియొనెల్ మెస్సీ.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవాకు ప్రత్యేక బహుమతి అందజేశాడు. ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ను గెలిచి కెరీర్ను సార్థకం చేసుకున్న మెస్సీ.. ప్రస్తుతం ఆ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ఈ సంతోషంలో మెస్సీ తన అభిమానులు, ఫాలోవర్లను మాత్రం మరిచిపోలేదు. ఇక భారత్లోనూ అతనికి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే.
ధోనీ, కోహ్లీ లాంటి క్రికెటర్లూ కూడా అతన్ని ఫాలో అవుతుంటారు. ఈ నేపథ్యంలో ధోనీ కూతురు జీవాకు.. మెస్సి తాను సంతకం చేసిన అర్జెంటీనా జెర్సీని పంపి తన ప్రేమను చాటుకున్నాడు. ఆ జెర్సీని ఇన్స్టాలో పోస్టు చేసిన జీవా.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. ఆ జెర్సీపై 'జీవా కోసం' అని రాసి దాని కింద మెస్సీ సంతకం చేశాడు. గతంలో కూడా మెస్సీ.. బీసీసీఐ సెక్రటరీ జై షాకు ఇలాంటి జెర్సీనే పంపిన విషయాన్ని స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ధోనికి క్రికెట్ తో పాటు ఫుట్బాల్ అంటే కూడా చాలా ఇష్టం. క్రికెట్ ప్రారంభించడానికంటే ముందు ధోని ఫుట్బాల్ ఆడేవాడని గతంలో స్వయంగా అతడే పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు. తండ్రి వలే జీవాకు కూడా ఫుట్బాల్ అంటే ఇష్టమేనట.
ఇక ఫిఫా ప్రపంచకప్ విషయానికొస్తే.. ఫైనల్లో మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా 4-2 తేడాతో ఫ్రాన్స్ను షూటౌట్లో చిత్తు చేసింది. నిర్ణీత సమయం, ఎక్స్ట్రా టైమ్లో ఇరు జట్లు 3-3తో గోల్స్ సమం చేయడంతో మ్యాచ్ ఫలితాన్ని షూటౌట్ ద్వారా తేల్చారు. షూటౌట్లో అర్జెంటీనా నాలుగు గోల్స్ చేయగా ఫ్రాన్స్ రెండు గోల్స్ మాత్రమే చేసింది. దీంతో మెస్సీ అండ్ కో. విశ్వ విజేతగా నిలిచింది. కెరీర్లో లోటుగా ఉన్న ప్రపంచకప్ మెస్సీ ఖాతాలో చేరింది.