కెప్టెన్సీ తనకు కొత్త కాదని సన్రైజర్స్ హైదరాబాద్(SRH) కెప్టెన్ ఇషాన్ కిషన్ అన్నాడు. అండర్ 19 స్థాయి నుంచి తాను కెప్టెన్సీ చేస్తున్నానని గుర్తు చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగింది. టాస్ సందర్భంగా మాట్లాడిన ఇషాన్ కిషన్ తుది జట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు.
'మా తుది జట్టులో రెండు మార్పులు చేశాం. ప్రఫుల్ హింగే జట్టులోకి వచ్చాడు. నేను చాలా కాలంగా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. గతంలో భారత అండర్-19 జట్టుతో పాటు నా రాష్ట్ర జట్టుకు కూడా కెప్టెన్గా వ్యవహరించాను. సారథ్యం ఆట పట్ల మరింత ఏకాగ్రతతో ఉంచడంతో పాటు పరిస్థితులపై మంచి అవగాహన ఉండేలా చేస్తుంది.

కెప్టెన్సీ అనేది వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు ప్రదర్శనకే ప్రాధాన్యతనిస్తుంది. జట్టు కోసం మరిన్ని విజయాలు సాధించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. కెప్టెన్గా ఉంటూ జట్టు కోసం బాగా రాణిస్తే అది ఆటగాడి పరిణతిని చూపిస్తుంది. గత కొన్నేళ్లుగా సారథిగా నా ప్రదర్శన నేను మళ్ళీ భారత జట్టులోకి పునరాగమనం చేసేందుకు సహాయపడింది.'అని ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు.
మరోవైపు టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది మాకు కొత్త వికెట్. ఇది కొత్త వికెట్. ఇప్పటి వరకు వాడని పిచ్. కాబట్టి ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది. ఈ మైదానంలో మేం చాలా సార్లు లక్ష్యాలను ఛేదించాం. 2024లో తృటిలో ప్లే ఆఫ్స్ అవకాశం కోల్పోయాం. ఈసారి అలా జరగకూడదని కోరుకుంటున్నాం.
తుది జట్టులో రెండు మార్పుల ఉన్నాయి. బ్రిజేష్ స్థానంలో తుషార్ దేశ్పాండే వచ్చాడు. హెట్మెయర్కు విశ్రాంతి ఇచ్చి, ప్రిటోరియస్కు అవకాశం ఇస్తున్నాం. ఇక్కడి వరకు రావడం ఒక ప్రయాణంలా అనిపిస్తోంది. నేను చాలా కాలం సంజూ శాంసన్ భయ్యా ఆధ్వర్యంలో ఆడాను. ఆ తర్వాత సంగక్కర వ్యూహాత్మక విషయాల్లో నన్ను భాగస్వామిని చేస్తూ నా ఆటను మెరుగుపరిచారు. ఇప్పుడు ఆ బాధ్యతను నేను తీసుకున్నాను. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా.. ఇక్కడ ఉండటం సంతోషంగా ఉంది.'అని రియాన్ పరాగ్ తెలిపాడు.
సన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్/వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలిల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఈషాన్ మలింగ.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), లువాన్-డ్రే ప్రిటోరియస్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్పాండే.