ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలవాలంటే సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ రాణించాలని మాజీ బౌలర్, సీఎస్కే దిగ్గజం లక్ష్మీపతి బాలాజీ అన్నాడు. శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ సెంచరీల మోత మోగించినా బౌలింగ్లో షమీ రాణించకపోతే టీమిండియాలో విజయాలు అందుకోలేదని అభిప్రాయపడ్డాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో మహమ్మద్ షమీ రాణించడం టీమిండియాకు అత్యంత కీలకమని చెప్పుకొచ్చాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో పాకిస్థాన్ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. గురువారం బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్తో భారత్ తమ క్యాంపైన్ను కొనసాగించనుంది. ఫిబ్రవరి 23న పాకిస్థాన్తో హై ఓల్టేజ్ ఆడనున్న టీమిండియా.. మార్చి2న న్యూజిలాండ్తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.

మహమ్మద్ షమీ రాణిస్తేనే..
టీ20 ప్రపంచకప్ 2024లో విజేతగా నిలిచిన భారత్ అదే జోరులో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ప్రస్తుతం జట్టు మొత్తం జోష్లో ఉంది. కోహ్లీ, రోహిత్, గిల్తో పాటు మిగతా బ్యాటర్లు, స్పిన్నర్లు సూపర్ ఫామ్లో ఉన్నారు. కానీ వెన్నుగాయంతో బుమ్రా దూరమవడంతో పేస్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది.
ఈ టోర్నీ నేపథ్యంలో ఓ జాతీయ ఛానెల్తో మాట్లాడిన లక్ష్మీపతి బాలాజీ.. మహమ్మద్ షమీ రాణించడంపైనే టీమిండియా విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయన్నాడు. 2019, 2023 వన్డే ప్రపంచకప్లో షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడన్నాడు. బుమ్రా కంటే ముందు షమీనే భారత పేస్ విభాగాన్ని నడిపించాడని గుర్తు చేశాడు.
ఆ రెండు ప్రపంచకప్ల్లో..
'వాస్తవానికి 2019, 2023 వన్డే ప్రపంచకప్ల్లో బుమ్రా కంటే మహమ్మద్ షమీ మెరుగైన ప్రదర్శన చేశాడు. మూడు ఫార్మాట్లలో బుమ్రా ఛాంపియన్ బౌలర్. కానీ షమీ ఎంతో అనుభవం కలిగిన పేసర్. బుమ్రా రాకముందు షమీని భారత పేస్ అటాక్ను నడిపించాడు. ఈ టోర్నీలో టీమిండియా ఆధిపత్యం కొనసాగాలన్నా.. విజయాలు సాధించాలన్నా కొత్త బంతితో షమీ మెరుగైన ప్రదర్శన చేయాలి. కొత్త బంతితో తొలి 6 ఓవర్లలో అతను చూపే ప్రభావం టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది.
చీలమండ గాయం తర్వాత అతని బౌలింగ్ వేగం తగ్గింది. గాయాలైనప్పుడు ఇది సహజం. ప్రతీ కీడాకారుడి జీవితంలో ఇది భాగమే. ఇందుకు మనం ఏం చేయలేం. ఈ సమస్య నుంచి అధిగమించే అనుభవం షమీకి ఉంది. అతను మరింత బౌలింగ్ చేస్తే మెరుగ్గా రాణిస్తాడు. ఫిజికల్ కండిషన్కు తగ్గట్లు ప్రాక్టీస్ కొనసాగించాలి.'అని బాలాజీ చెప్పుకొచ్చాడు.