ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్... ఇద్దరూ భారత దిగ్గజాల మధ్య గొడవకు తెరలేపింది. ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే, మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ట్విటర్ వేదికగా వాగ్వాదానికి దిగారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. ధోనీ సంచలన బ్యాటింగ్తో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది.చెన్నై బ్యాటింగ్ ముగిసిన వెంటనే హర్షా భోగ్లే ట్విటర్ వేదికగా ఈ లక్ష్యం సరిపోదని అభిప్రాయపడ్డాడు.

లక్ష్యం సరిపోదంటూ..
సాధారణంగా ప్రతీ మ్యాచ్కు హర్షా భోగ్లే ఇలానే స్పందిస్తాడు. ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్లోనూ తన అలవాటును కొనసాగించాడు. '206 పరుగుల లక్ష్యం మంచిదే. కానీ ఈ పిచ్పై ఏ మాత్రం సరిపోదు. డ్యూ ప్రభావంతో పాటు ఎక్కువగా బౌలింగ్ ఆప్షన్స్ లేని చెన్నై సూపర్ కింగ్స్ ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడం కష్టమే. ఆ జట్టు మరో 20 పరుగులు అదనంగా చేయాల్సింది.'అని హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు.
ఈ పోస్ట్తో ఆగ్రహానికి గురైన తమిళనాడు మాజీ క్రికెటర్, భారత మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఘాటుగా స్పందించాడు. 'మీరంతా చెన్నై జట్టును తక్కువ చేసేందుకు ఇష్టపడుతారు. మీరు ఈ ఆటలు నాతో ఆడాలి. చెన్నై సూపర్ కింగ్స్తో కాదు. ముంబై ఫ్రీక్స్'అని ఘాటుగా కామెంట్ చేశాడు.
నువ్వెలా కామెంటేటర్ అయ్యావు రా..?
అంతటితో ఆగకుండా నువ్వెలా కామెంటేటర్వు అయ్యావో.. ఇన్నాళ్లు భారత క్రికెట్లో ఎలా కొనసాగావో అర్థం కావడం లేదని సెటైర్ పేల్చాడు. ఈ కామెంట్స్కు భోగ్లే ఎలాంటి రిప్లే ఇవ్వలేదు. ఏమైందో ఏమో కానీ లక్ష్మణ్ శివరామకృష్ణన్ తన రెండు ట్వీట్స్ను తొలగించాడు. కానీ అప్పటికీ ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్గా మారాయి.
ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో హర్షా భోగ్లేపై సీఎస్కే ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోహ్లీ ఫ్యాన్స్ సైతం..
ఇక హర్షా భోగ్లే ద్వంద వైఖరిని విరాట్ కోహ్లీ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీని.. వన్డే బ్యాటింగ్ అంటూ విమర్శించిన హర్షా భోగ్లే.. అదే తరహాలో చేసిన రోహిత్ శర్మ సెంచరీని మాత్రం మెచ్చుకున్నాడు.
మరో ఎండ్లో సహకారం లభిస్తే ముంబైని రోహిత్ శర్మ గెలిపించేవాడని కామెంట్ చేశాడు. దాంతో ఈ రెండు ట్వీట్స్ను పెట్టి హర్షా భోగ్లేను కోహ్లీ ఫ్యాన్స్ ఏకి పారేస్తున్నారు. కోహ్లీపై భోగ్లేకు ఉన్న విద్వేషం ఇదేనని కామెంట్ చేస్తున్నారు.