
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్, దిగ్గజ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన జీవితకాలమంతా వర్ణ వివక్షకు గురైనట్లు ట్వీట్ చేశారు. అయితే ఈ వివక్షతో తాను ఏనాడు బాధపడలేదని శివరామకృష్ణన్ స్పష్టం చేశాడు. సోషల్ మీడియా వేదికగా కామెంటేటర్లపై జరుగుతన్న ట్రోలింగ్పై స్పందిస్తూ శివరామకృష్ణన్ ఈ ట్వీట్ చేశాడు.'నా రంగుతో నేను వివక్షకు గురయ్యాను. విమర్శలూ ఎదుర్కొన్నాను. నా జీవితమంతా ఇలానే గడిచింది కాబట్టే నన్నేమీ అది బాధించలేదు. దురదృష్టవశాత్తూ ఇది మన దేశంలోనే జరిగింది' అని ఆయన పోస్ట్ చేశారు.
తమిళనాడుకు చెందిన 55 ఏళ్ల శివరామకృష్ణన్ భారత్ తరఫున 1983 నుంచి 1987 మధ్య కాలంలో 9 టెస్టులు ఆడి 26 వికెట్లు, 16 వన్డేలు ఆడి 15 వికెట్లు తీశారు. అనంతరం కామెంటేటర్గా సేవలందిస్తున్నాడు. భారత క్రికెట్లో పలు పదవులను కూడా ఆయన చేపట్టారు. టీమిండియా మాజీ ఓపెనర్ అభినవ్ ముకుంద్ సైతం వర్ణ వివక్షకు గురైనట్లు ఇటీవల ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ పోస్ట్లో ముకుంద్ తన ఆవేదనను పంచుకున్నాడు.
'నా 15 ఏళ్ల వయసు నుంచే ఈ దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకు కూడా ప్రయాణించాను. నేను యువకుడిగా ఉన్నప్పుడు వర్ణ వివక్షకు గురయ్యాను. నా శరీర రంగును ప్రజలు విచిత్రంగా చూసేవారు. నేను ఎండలోనే ఆడేవాడిని కాబట్టి నల్లగా అయ్యేవాడిని. కానీ ఎన్నడూ దాని గురించి బాధపడలేదు.'అని పేర్కొన్నాడు.
గత కొన్ని నెలలుగా క్రికెట్లో వివక్ష అనేది తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ క్రికెట్లో ఈ అంశం ఆటగాళ్లపై నిషేధం విధించే వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ కామెంట్రీ చెప్పకుండా చేసింది.