న్యూఢిల్లీ : టీమిండియా సెలక్షన్ ప్యానెల్ పదవికి భారత మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ దరఖాస్తు చేశాడు. అతనితో పాటు మాజీ ఆఫ్ స్పిన్నర్ రాజేష్ చౌహన్, లెఫ్టాండ్ బ్యాట్స్మన్ అమయ్ ఖురసియ సైతం ఈ పదవికోసం పోటీపడుతున్నారు. ఇక ఈ ముగ్గురు భారత సెలెక్షన్ ప్యానెల్కు దరఖాస్తు చేసుకున్నామని అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుత సెలెక్షన్ కమిటీలో ఎమ్మెస్కే ప్రసాద్(సౌత్ జోన్), గంగన్ ఖోడా(సెంట్రల్ జోన్) పదవీకాలం పూర్తవ్వడంతో వారి స్థానాల్లో మాత్రమే కొత్త వారిని ఎంపిక చేస్తామని బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. మరో ఏడాది పదవీకాలం ఉన్న దేవాంగ్ గాంధీ(ఈస్ట్ జోన్), శరణ్దీప్ సింగ్(నార్త్ జోన్), జతిన్ పరంజపే(వెస్ట్ జోన్)లను అలాగే మరో సీజన్ వరకు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. సెలెక్షన్ ప్యానెల్ పదవుల దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 24(శుక్రవారం)గా పేర్కొన్న బీసీసీఐ.. ఎంపిక కసరత్తులను మొదలుపెట్టింది.
ఛీఫ్ సెలెక్టర్ పదవి రేసులో నిలిచిన శివరామకృష్ణన్ గత 20 ఏళ్లుగా కామెంటేటర్గా పనిచేస్తున్నారు. నేషనల్ క్రికెట్ అకాడమీలో స్పిన్ బౌలింగ్ కోచ్గా పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా ఐసీసీ క్రికెట్ కమిటీల్లో పాల్గొన్నారు.
జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ వెంకటేశ్ ప్రసాద్, టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్లు కూడా సీనియర్ సెలెక్షన్ ఛైర్మన్ పదవి రేసులోనిలవనున్నారు. దీంతో ఈ ముగ్గురు మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది. 57 ఏళ్ల శివరామకృష్ణ అంతర్జాతీయంగా 9 టెస్టులు, 16 వన్డేలు ఆడగా.. సంజయ్ బంగర్ 12 టెస్ట్లు, 15 వన్డేలు ఆడాడు. ఇక వెంకటేశ్ ప్రసాద్ 33 టెస్ట్లు, 161 వన్డేలు ఆడటంతో పాటు జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ రెండున్నరేళ్ల అనుభవం ఉంది. దీంతో అంతను ఎంపికైనా నిబంధనల మేరకు సీనియర్ సెలెక్టర్గా ఏడాదిన్నరే కొనసాగనున్నాడు. ఇక ఛీఫ్ సెలెక్టర్గా అవకాశం లభిస్తే తన ప్రత్యేకత ఏంటో చూపిస్తానని శివరామకృష్ణన్ తెలిపాడు.
'నా కుటుంబంతో చర్చించి జాతీయ సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నాను. ఒకవేళ బీసీసీఐ నాకు అవకాశం కల్పిస్తే.. సెలెక్టర్గా నా ప్రత్యేకత ఏంటో చూపిస్తా. ఇక నాకు నాలుగేళ్ల అవకాశం వస్తే మూడు విభాగాల్లో ముఖ్యంగా స్పిన్ను బలంగా చేస్తా. ఓ వ్యాఖ్యాతగా గత 15 ఏళ్లలో ఇంటర్నేషనల్ క్రికెటే కాకుండా డొమెస్టిక్ క్రికెట్ చూసిన అనుభవం ఉంది. మణికట్టు స్పిన్నర్లను తీర్చిదిద్దుతాననే నమ్మకం ఉంది.'అని ఈ మాజీ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు.