
బీసీసీఐకే సాయం చేసిన గాన కోకిల
అది 1983 ప్రపంచకప్.. ఓవైపు లార్డ్స్ బాల్కనీలో కపిల్ దేవ్ కప్ అందుకుంటుంటే.. మరోవైపు అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ దివంగత ఎన్కేపీ సాల్వేలో ఒకటే ఆందోళన. అంతపెద్ద అచీవ్మెంట్ సాధించిన టీమ్కు క్యాష్ ప్రైజ్ ఇవ్వడానికి కూడా బోర్డు వద్ద డబ్బులు లేని పరిస్థితి. దీని నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్న వేళ.. బోర్డు మెంబర్ రాజ్సింగ్ దంగార్పూర్ ఓ ఐడియాతో ముందుకొచ్చాడు.

పాటల కచేరితో..
లెజండరీ సింగర్ లతా మంగేష్కర్తో పాటల కచేరి నిర్వహిస్తే బాగుంటుందని ప్రతిపాదించాడు. ఇదే విషయాన్ని లతాజీ ముందుంచగా సంతోషంగా ఒప్పుకున్న ఆమె.. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు గంటల పాటు పాటలు పాడి అలరించింది. ఈ కార్యక్రమం ద్వారా బీసీసీఐ అనుకున్న దానికంటే ఎక్కుడే డబ్బులు సమకూరాయి.
కపిల్ బృందంలోని 14 మంది సభ్యులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున నజరానా అందింది. 1983 ప్రపంచకప్ ఫైనల్ జరిగే సమయంలో లత ఒక సంగీత విభావరి కోసం లండన్లోనే ఉన్నారు. ట్రోఫీ గెలిచిన తర్వాత కపిల్ బృందాన్ని కలిసి ఆమె అభినందించారు.

భారత్ గెలవాలని..
2011 ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ మధ్య సెమీఫైనల్లో మన జట్టు గెలవాలని లత ఉపవాసం ఉన్నారు. మొహాలీలో ఈ మ్యాచ్ జరిగిన తొమ్మిది గంటల సమయంలో ఆమె ఏం తినలేదు. తాగలేదు. ''మ్యాచ్ ఆసాంతం వీక్షించాను. చాలా ఉత్కంఠగా అనిపించింది. ఈ సమయంలో ఏం తినలేదు. తాగలేదు. నాతో పాటు మా కుటుంబ సభ్యులందరూ ఉపవాసం ఉన్నారు. మ్యాచ్లో భారత్ గెలుపు కోసం ప్రార్థిస్తూనే ఉన్నాం'' అని మ్యాచ్ అనంతరం లత చెప్పారు.

ప్రతీ మ్యాచ్కు రెండు టికెట్లు..
ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు తరుచూ వచ్చే లత.. ఆటగాళ్లతో చర్చించేవాళ్లు. సునీల్ గావస్కర్, దిలీప్ వెంగ్సర్కార్, సచిన్ తెండూల్కర్ తదితరులతో లతకు సాన్నిహిత్యం ఉండేది. లత గౌరవార్థం భారత్లోని ప్రతి స్టేడియంలో ఆమెకు రెండు వీఐపీ సీట్లను బీసీసీఐ శాశ్వతంగా కేటాయించింది. 1998లో ఇండియన్ ఎలెవన్, శ్రీలంక ఎలెవన్ మధ్య వాంఖడేలో ఓ ఛారిటీ మ్యాచ్ని నిర్వహించిన బీసీసీఐ.. ఆ ఫండ్స్ని లతా మంగేష్కర్ ఫ్యామిలీ పుణెలో నిర్మించిన ఆసుపత్రికి అందజేసింది. లతా మంగేష్కర్ మృతికి సంతాపంగా వెస్టిండీస్తో తొలి వన్డేలో భారత ఆటగాళ్లు నల్ల రిబ్బన్లను ధరించి బరిలో దిగారు.


Click it and Unblock the Notifications












