సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా ఓటమికి ఆఖరి 10 ఓవర్లే కారణమని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. చివరి 10 ఓవర్లలో సౌతాఫ్రికా మెరుగ్గా బౌలింగ్ చేసి భారత్ను కట్టడి చేసిందని అభిప్రాయపడ్డాడు. బుధవారం రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో సమష్టిగా విఫలమైన భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 358 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. విపరీతమైన డ్యూ రావడంతో పాటు పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్ టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసాయి.
అయితే డ్యూ ఫ్యాక్టర్ కండిషన్స్ నేపథ్యంలో భారత్ అదనంగా 20-30 పరుగులు చేయాల్సిందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇర్ఫాన్ పఠాన్ కూడా ఎక్స్ వేదికగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

'బ్యాటింగ్ సమయంలో చివరి కొన్ని ఓవర్లే టీమిండియా ఓటమికి కారణమయ్యాయి.'అని ట్వీట్ చేశాడు. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా 40 ఓవర్లలో 284/4 స్కోర్తో భారీ స్కోర్ దిశగా సాగింది. 380-400 స్కోర్ చేసేలా కనిపించింది. కానీ ఆఖరి 10 ఓవర్లలో సౌతాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ 74 పరుగులే చేసింది.
ఫినిషర్ పాత్ర పోషించాల్సిన జడేజా 27 బంతుల్లో 24 పరుగులే చేశాడు. వాషింగ్టన్ సుందర్ 8 బంతుల్లో 1 పరుగే చేసి వెనుదిరిగాడు. రాహుల్ ఒక్కడే 43 బంతుల్లో 66 పరుగులు చేశాడు. జడేజా కూడా అతనికి సహకారం అందించి ఉంటే భారత్ 20 30 పరుగులు అదనంగా చేసి ఉండేది. ఈ విషయాలనే ప్రస్తావిస్తూ జడేజా, సుందర్లపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. జడేజా, సుందర్ల పేర్లు నేరుగా ప్రస్తావించకపోయినా.. లోయార్డర్ వైఫల్యం ఓటమికి కారణమైందన్నాడు. లోయరార్డర్లో ఆడింది జడేజా, సుందర్లు మాత్రమే.