
హైదరాబాద్: భవిష్యత్తులో ఐపీఎల్లో ఆడే ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్కు ఒక మిలియన్ డాలర్లు (సుమారు 6.60 కోట్లు) ఇచ్చే రోజు వస్తుందని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ చెప్పుకొచ్చారు. 2008లో లలిత్ మోడీ నేతృత్వంలో రూపొందిన ఈ లీగ్ అతి తక్కవ కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఇంటా బయటా ఇప్పుడున్న ఎన్నో లీగ్లకు ఐపీఎలే ప్రేరణ కావడం విశేషం.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఐపీఎల్ మొదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఓ స్థానిక పత్రికకు ఇంటర్యూలో లలిత్ మోడీ మాట్లాడుతూ ఐపీఎల్ వల్ల భవిష్యత్తులో దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక క్రికెట్ సిరిస్లు కనుమరుగవుతుందని హెచ్చరించాడు. ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంచైజీలకు విధించిన 12 మిలియన్ డాలర్ల పరిమితి ఎత్తేస్తే.. ఈపీఎల్, ఎన్ఎఫ్ఎల్ మాదిరి క్రికెటర్లు సంపాదించే అవకాశముందని చెప్పాడు.
'ఐపీఎల్ ఇప్పుడు ఉన్నత శిఖరంలో ఉంది. ప్రపంచంలోనే మేటి క్రికెట్ లీగ్గా ఎదిగింది. ఎంతో మంది ప్రేక్షకుల్ని, స్పాన్సర్లను ఆకట్టుకుంది. ఫ్రాంచైజీ యాజమాన్యాలు బాగా ఆర్జిస్తున్నాయి. భారత్లోని క్రికెట్ క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్నాయి. బెన్ స్టోక్స్ సీజన్కు రూ.12 కోట్లు (1.95 మిలియన్) సంపాదిస్తున్నాడు. త్వరలో రూ. 72 కోట్లు (12 మిలియన్) సంపాదిస్తాడు. క్రికెటర్లు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్లో ఫుట్బాలర్ల ఆదాయాన్ని అందుకోగలరు. ఇది భవిష్యత్తులో సాధ్యమవుతుంది' అని అన్నాడు.
ఐపీఎల్ వల్ల ఐసీసీ కూడా జీరో అయ్యిందని మోడీ చెప్పాడు. భారత్ ఒకవేళ ఐపీఎల్ను విస్తరించాలని భావిస్తే ఐసీసీ మనకు చెక్ పెట్టే అవకాశం ఉందని, అయినా బీసీసీఐ సొంత కాళ్ల మీద నిలబడే ఐపీఎల్ను విజయవంతంగా నడిపించుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రపంచ క్రికెట్తో పోల్చుకుంటే భారత దేశవాళీ క్రికెట్ 20 రెట్లు పెద్దదని మోడీ అన్నాడు.
ఐపీఎల్ వల్ల దేశాల మధ్య దైపాక్షిక సిరీస్లు ఇకపై కనుమరుగయ్యే అవకాశం ఉందని లలిత్ చెప్పాడు. మరోవైపు ఆటగాళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే ఐపీఎల్లో ఆడటానికే మొగ్గు చూపుతారని చెప్పాడు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల రెండో దేశమైన భారత్లో ఈ లీగ్ జరుగుతుండడంతో స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్లు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే.
టీ20 లీగ్ల ప్రాచుర్యంతో సంప్రదాయ క్రికెట్కు గడ్డుకాలం తప్పదన్నారు. నాలుగేళ్లకోకసారి జరిగే వరల్డ్ కప్ మాత్రం సజావుగా సాగుతుందని, సాంప్రదాయక క్రికెట్ను బతికించుకోవాలంటే టెస్ట్ చాంపియన్షిప్ నిర్వహించాలని లలిత్ మోడీ సూచించాడు.