
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరును కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారని టీమిండియా మాజీ క్రికెటర్, ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ)..క్రికెట్ అభివృద్ధి కమిటీ (సీడీసీ) చైర్మన్ లాల్చంద్ రాజ్పుత్ పేర్కొన్నాడు. ఎంసీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈమేరకు లాల్ చంద్ ఎంసీఏ అధ్యక్షుడు విజయ్ పాటిల్కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు.
ఎంసీఏలో వివిధ వయస్సు గ్రూపుల జట్ల సెలెక్టర్లు, కోచ్ల పదవులకు రాజ్పుత్ ఆధ్వర్యంలోని సీడీసీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. అయితే కొందరు వ్యక్తులు సచిన్ పేరు చెప్పి కోచ్ల పదవులకు సిఫారసు చేస్తున్నారని రాజ్పుత్ తెలిపాడు. 'టెండూల్కర్ను మేం గౌరవిస్తాం. అయితే ఫలానా వ్యక్తులను ఫలానా పదవులకు సచిన్ సిఫారసు చేస్తున్నాడని కొందరు మాపై ఒత్తిడి తెస్తున్నారు. ఎవరి పేరైనా సచిన్ సిఫారసు చేయదలిస్తే అధ్యక్షుడికో లేదా సీడీసీకో నేరుగా ఫోను చేయవచ్చు.

మేమంతా అతడికి తెలుసు. అతనో ఐకాన్. మేమంతా అతన్ని గౌరవిస్తాం. అతను ఇచ్చే సలహాలు, సూచనలను మేం పాటిస్తాం.'అని లేఖలో రాజ్పుత్ పేర్కొన్నాడు. అయితే ఈ లేఖపై స్పందించిన ఎమ్సీఏ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ అమిత్ దాని కన్వీనర్లు ముందు సీఈవో, సెక్రటరీల భేధాభిప్రాయాలను తొలగించాలని సూచించాడు.
ఇక దీనిపై స్పందించిన లాల్ చంద్ సెక్రటరీ, సీఈవోల మధ్య ఎలాంటి భేధాభిప్రాయాలు లేవని, వారితో మాట్లాడటం కూడా జరిగిందన్నాడు. ఆ తర్వాతే ఇంటర్వ్యూలు చేపట్టామన్నాడు. వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలని చురకలంటించాడు. ఇలాంటి వల్లే ముంబై క్రికెట్ ప్రతిష్ట దిగజారుతుందని అసహనం వ్యక్తం చేశాడు.