అమ్మో.. అది మామూలు టెన్షన్ కాదు! తట్టుకోలేక బాత్రూమ్లోకి వెళ్లా: స్టార్ పేసర్

లండన్: గతవారం టీమిండియాతో ముగిసిన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా జరిగిన డబ్ల్యూటీసీ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన కివీస్.. ఐసీసీ ట్రోఫీ కల తీర్చుకుంది. విజేతగా నిలిచిన కివీస్కి ఛాంపియన్షిప్ గదతో పాటు రూ.11.67 కోట్ల ప్రైజ్మనీ దక్కింది. ఫైనల్లో టీమిండియాను తన పేస్ బౌలింగ్తో అల్లాడించిన కైల్ జేమీసన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. అయితే ఆరో రోజు (రిజర్వ్ డే) కివీస్ చేజింగ్ చేస్తున్నప్పుడు ఆ టెన్షన్ తట్టుకోలేకపోయానని జేమీసన్ చెప్పాడు.

డాట్ బాల్ పడినా అరుపులే
139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్, డెవాన్ కాన్వేలు కొద్ది వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో భారత్ కూడా రేసులోకి వచ్చింది. దీంతో మైదానంలోని భారత అభిమానులు బంతిబంతికి కోహ్లీసేనను ఉత్సాహపరిచారు. ఎంతలా అంటే.. డాట్ బాల్ పడినా కూడా అరుపులు, ఈలలతో మైదానాన్ని హోరెత్తించారు.
దీంతో డ్రెస్సింగ్ రూమ్ లోపల ఉన్న కివీస్ పేసర్ కైల్ జేమీసన్ బయపడిపోయాడట. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం మ్యాచ్ విజయాన్నిపెద్దగా ఆస్వాదించే అవకాశం జేమీసన్కు దక్కలేదు. మ్యాచ్ ముగిసిన 48 గంటల్లోపే అతడు కౌంటీ క్రికెట్ ఆడటానికి వెళ్లాడు. ప్రస్తుతం జేమీసన్ ఇంగ్లండ్ కౌంటీ టీమ్ సర్రేకు ఆడుతున్నాడు.

టెన్షన్ తట్టుకోలేక బాత్రూమ్లోకి వెళ్లా
తాజాగా కైల్ జేమీసన్ ఓ షోలో మాట్లాడుతూ... 'ఓ మ్యాచ్ చూడటానికి నేను ఇంత ఇబ్బంది పడిన సందర్భంగా బహుశా గతంలో ఎప్పుడూ లేదు. మేము డ్రెస్సింగ్ రూమ్ లోపల కూర్చొని టీవీలో మ్యాచ్ చూస్తున్నాం. ప్రతి బాల్కు టీమిండియా ఫ్యాన్స్ అరుస్తున్నప్పుడల్లా వికెట్ పడిందా? అన్న ఆందోళన నాలో కలిగింది.
కానీ తీరా చూస్తే.. అలా లేదు. డాట్ బాల్ లేదంటే సింగిల్ వచ్చినప్పుడల్లా వాళ్లు అరుస్తున్నారు. ఇది చాలా కష్టమైన మ్యాచ్. కొన్నిసార్లు ఆ టెన్షన్ తట్టుకోలేక నేను బాత్రూమ్లోకి వెళ్లాను. ఆ సౌండ్ వినిపించకుండా ఉండేందుకు అలా చేశాను. కేన్ మరియు రాస్ క్రీజులో ఉండడంతో విజయంపై నమ్మకంగా ఉన్నాం' అని తెలిపాడు.
ఐసీసీ అధికారిక ప్రకటన.. యూఏఈ, ఒమన్ వేదికగా టీ20 ప్రపంచకప్! టోర్నీ ప్రారంభం ఎప్పుడంటే?

ఏడాది కాలంలోనే స్టార్గా ఎదిగాడు
యువ పేసర్ కైల్ జేమీసన్ అందరూ అనుకున్నట్టుగానే డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్కు ఒంటిచేత్తో విజయం అందించాడు. తన పొడవు, పేస్ను ఉపయోగించుకొని కోహ్లీసేనను భారీ దెబ్బ కొట్టాడు. కీలక ఆటగాళ్లను ఔట్ చేసి భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్లో కేవలం 31 పరుగులే ఇచ్చి.. 5 వికెట్లు తీశాడు. జేమీసన్ 22 ఓవర్లు వేస్తే అందులో 12 మెయిడిన్లే కావడం గమనార్హం. రెండో ఇన్నింగ్స్లో 24 ఓవర్లలలో 2 వికెట్లు పడగొట్టాడు. జేమీసన్ ఇప్పటివరకు 8 టెస్టులు ఆడి 46 వికెట్లు పడగొట్టాడు. 2020లో ఆరంగేట్రం చేసి.. ఏడాది కాలంలోనే స్టార్ ఆటగాడిగా ఎదిగాడు.

8 టెస్టుల్లో 46 వికెట్లు
కైల్ జెమీసన్ 8 టెస్టుల్లో 46 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా తక్కువ మ్యాచుల్లో ఎక్కువ వికెట్లు తీసుకున్న తొలి న్యూజిలాండ్ బౌలర్గా రికార్డులోకి ఎక్కాడు. ఈ క్రమంలో 80 ఏళ్ల నాటి రికార్డును అతడు బద్దలుగొట్టాడు. ఇక ఐపీఎల్ టోర్నీలో జెమీసన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో తన కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీని ఫైనల్లో రెండుసార్లు ఔట్ చేయడం తనకు మరుపురాని ఫీలింగ్ అని అతడు అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications