
ముంబై: ఐపీఎల్ 2021 మినీ వేలంలో న్యూజిలాండ్ యువ పేసర్ కైల్ జేమిసన్ భారీ ధర పలికిన విషయం తెలిసిందే. ఈ కివీస్ యువ పేసర్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) రూ.15 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే న్యూజిలాండ్ కరెన్సీలో రూ.15 కోట్లంటే ఎంతో తనకు తెలియదని జేమీసన్ తెలిపాడు. ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కడంపై సంతోషం వ్యక్తం చేశాడు. తన కెరీర్కు ఈ మెగా టోర్నీ అనుభవం ఉపయోగపడుతుందని న్యూజిలాండ్కు చెందిన వెబ్సైట్కు తెలిపాడు.
'నేను అర్ధరాత్రి లేచాను. ఫోన్లు ఏమైనా వస్తాయేమో చూద్దామనుకున్నా. పరిస్థితి తప్పించుకోలేమని తెలిసి హాయిగా కూర్చొని ఆస్వాదిద్దామనుకున్నా. నా పేరు వేలానికి ఎప్పుడొస్తుందా అని గంటన్నర కష్టంగా ఎదురుచూశాను. అంతలోనే వేలం ఎంత బాగా సాగుతోందో కదా అని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ షేన్బాండ్ నుంచి మెసేజ్ వచ్చింది. వాస్తవానికి రూ.15 కోట్లంటే ఎంతో? న్యూజిలాండ్ డాలర్లలోకి ఎలా బదిలీ చేస్తారో కూడా నాకు తెలియదు. ఏదేమైనా ఆ సందర్భాన్ని రెండు మూడు నిమిషాలు బాండ్తో పంచుకోవడం బాగుంది.'అని చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్ జట్టు సభ్యులు పార్టీ అడిగితే ఏం చేస్తావని ప్రశ్నించగా 'కాఫీలు కొనిస్తానని అనుకుంటున్నా. ఏమో తెలియదు. వేలం జరిగి కొన్ని గంటలే కదా అయింది. రాత్రికి రాత్రే నా బ్యాంకు ఖాతాలోకి సొమ్ము మారదు కదా. అందుకే కాఫీలు లేదా బీర్లు కొనిస్తా. అని చెబుతున్నా' అని తెలిపాడు.
విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్వెల్తో కలిసి ఆడబోతున్నందుకు సంతోషంగా ఉందని జేమీసన్ తెలిపాడు. 'ఐపీఎల్ ప్రత్యేక టోర్నమెంట్. భారీ ఫ్రాంచైజీలు ఉంటాయి. నేర్చుకొనేందుకు, అనుభవం సంపాదించేందుకు ఎంతో అవకాశం ఉంటుంది. నిజానికి అదే నన్ను ఉత్సాహపరుస్తోంది. గొప్పవాళ్లతో కలిసి మ్యాచులు ఆడొచ్చు. ఇదో ప్రత్యేక సందర్భం' అని అతడు పేర్కొన్నాడు.
కివీస్ క్రికెటర్లలో అత్యధిక ధర పలికిన ఆటగాడు ఇప్పటి వరకు జేమీసన్ ఒక్కడే. ఇక ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికిన నాలుగో ఆటగాడు అతనే. అమెరికా డాలర్లలో రూ.15 కోట్ల విలువ 20 లక్షల డాలర్లకు సమానం కావడం గమనార్హం.