లక్నో: ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని అందిపుచ్చుకోకపోవడం.. స్ట్రైక్ రొటేట్ చేయకుండా ఎక్కువ డాట్స్ బాల్స్ ఆడటం తమ ఓటమిని శాసించిందని శ్రీలంక తాత్కలిక కెప్టెన్ కుశాల్ మెండీస్ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన మ్యాచ్లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
మెగాటోర్నీలో శ్రీలంకకు ఇది హ్యాట్రిక్ పరాజయం కాగా.. ఆసీస్కు తొలి విజయం. ప్రపంచకప్ రేసులో నిలవాలంటే శ్రీలంక తమ తదుపరి 6 మ్యాచ్ల్లో ప్రతీ మ్యాచ్ గెలవాలి. అంతకాకుండా మెరుగైన రన్రేట్ సాధించాలి.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన కుశాల్ మెండీస్.. తమ పరాజయంపై స్పందించాడు. 290-300 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేదని తెలిపాడు. 'పాతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా అసాధారణ బ్యాటింగ్తో అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. కానీ మిడిల్ ఓవర్లలో మా బ్యాటర్లు తడబడ్డారు. మేం 290-300 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేది.
ఈ పిచ్పై ఈ స్కోరే ఉత్తమమైనది. బ్యాటింగ్ సమయంలో మేం ఎక్కువగా స్ట్రైక్ రొటేట్ చేయలేదు. ఎక్కువగా డాట్ బాల్స్ ఆడాం. క్విక్ సింగిల్స్, డబుల్స్ తీయాల్సింది. గత రెండు మ్యాచ్ల్లో బ్యాటింగ్ బాగా చేసినా.. ఈ మ్యాచ్లో మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడ్డాం. మాకు మరో 6 మ్యాచ్లు ఉన్నాయి. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తాం.
మా బ్యాటింగ్ యూనిట్పై నాకు నమ్మకం ఉంది. మధుషంక అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆరంభంలోనే వికెట్లు తీసి ఆశలు రేకేత్తించాడు. గాయాల బారిన బాడిన డసన్ షనక, మతీష పతీరణ త్వరగా కోలుకుంటారని భావిస్తున్నా.'అని కుశాల్ మెండీస్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రీలంక ఓపెనర్లు పాతుమ్ నిస్సంక(67 బంతుల్లో 8 ఫోర్లతో 61), కుశాల్ పెరీరా(82 బంతుల్లో 12 ఫోర్లతో 78) హాఫ్ సెంచరీల రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా(4/47) నాలుగు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు.
మిచెల్ స్టార్క్(2/43), ప్యాట్ కమిన్స్(2/32) రెండేసి వికెట్లు తీసారు. గ్లేన్ మ్యాక్స్వెల్కు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆసీస్.. 35.2 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. మిచెల్ మార్ష్(67 బంతుల్లో 9 ఫోర్లతో 51), జోష్ ఇంగ్లీస్(59 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు.
మార్నస్ లబుషేన్(60 బంతుల్లో 2 ఫోర్లతో 40), గ్లేన్ మ్యాక్స్వెల్(21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక మూడు వికెట్లు తీయగా.. దునిత్ వెల్లలాగే ఓ వికెట్ పడగొట్టాడు.