IND vs SL, World Cup 2023: టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ ఇచ్చిన క్యాచ్లను పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదని శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండీస్ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం భారత్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 302 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది.
భారత పేసర్ల ధాటికి 55 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక.. సెమీస్ రేస్ నుంచి అధికారికంగా తప్పుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఘోర పరాజయంపై స్పందించిన కుశాల్ మెండీస్.. ఫీల్డింగ్లో చేసిన తప్పిదాలు తమ ఘోర పరాజయాన్ని శాసించాయని తెలిపాడు. 'ఈ పరాజయం తీవ్రంగా నిరాశపరిచింది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.

సీమ్, స్వింగ్తో ఆధిపత్యం చెలాయించారు. దురదృష్టవశాత్తు మేం సామర్థ్యానికి తగినట్లు ఆడలేకపోయాం. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం తప్పిదమని నేను భావించడం లేదు. వికెట్ చాలా నెమ్మదిగా ఉండటంతోనే నేను బౌలింగ్ ఎంచుకున్నాను. మధుషంక అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ ఆరంభంలో ఇచ్చిన క్యాచ్లను మేం వదిలేసాం.
ఈ రెండు క్యాచ్లు పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేది. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మిడిల్ ఓవర్లలో కట్టడి చేశారు. ఇక భారత బౌలర్లు అదరగొట్టారు. తొలి 6 ఓవర్లలో నిప్పులు చెరిగారు. ఈ విజయం క్రెడిట్ టీమిండియా పేస్ బౌలింగ్ విభాగానిదే. మాకు ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి. బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ల్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం.'అని కుశాల్ మెండీస్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లతో 92), విరాట్ కోహ్లీ(94 బంతుల్లో 11 ఫోర్లతో 88), శ్రేయస్ అయ్యర్(56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లతో 82) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. శ్రీలంక బౌలర్లలో మధుషంక(5/82) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. దుష్మంత్ చమీరాకు ఓ వికెట్ దక్కింది.
అనంతరం శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ షమీ(5/18), మహమ్మద్ సిరాజ్(3/16)కు తోడుగా జస్ప్రీత్ బుమ్రా(1/8), రవీంద్ర జడేజా(1/4) రాణించారు.