
ముంబై: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్లో టాప్-4లో ఒకరు దంచికొట్టాలని, భారీ స్కోర్లు నమోదు చేయాలని ఆ జట్టు డైరెక్టర్ కుమార సంగక్కర అన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. దాంతో ఈ సీజన్లో ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింటిలో ఓడి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో తమ టీమ్ పెర్ఫామెన్స్పై స్పందించిన సంగక్కర.. పలు సూచనలు చేశాడు.
'మా బ్యాటింగ్ లైనప్ బలగాన్ని చూస్తే విలువైన భాగస్వామ్యాలు నిర్మించాల్సి ఉంది. టాప్ 4లో ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడాలి. పవర్ప్లేలో చాలా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరముంది. మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాలి. ఒకరిద్దరు భారీ పరుగులు చేయాలి. దురదృష్టం కొద్దీ ఈ మ్యాచ్లో అలా ఆడలేకపోయాం. మిడిల్, లోయర్ బ్యాట్స్మెన్ బాగా ఆడారు. ముఖ్యంగా శివమ్దూబె గత మ్యాచ్లకన్నా ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు. మేం బ్యాటింగ్లో కలిసి కట్టుగా ఆడాలి. కేవలం బౌలింగ్, ఫీల్డింగ్ బాగా చేస్తే సరిపోదు' అని సంగక్కర చెప్పుకొచ్చాడు.
'ఆటలోని ప్రణాళికలు అమలుపరిచే విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటికి నాలుగు మ్యాచ్లే పూర్తయ్యాయి. ఇంకా అనేక మ్యాచులు ఆడాల్సి ఉండటంతో మా వైఫల్యాలపై దృష్టిసారించాల్సి ఉంది. ఇక ఆర్సీబీ యువ బ్యాట్స్మన్ దేవ్దత్ పడిక్కల్ అత్యద్భుతంగా ఆడాడు' అని సంగక్కర కొనియాడాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఒక దశలో బెంగళూరు బౌలర్ సిరాజ్ (3/27) ధాటికి 43/4తో కష్టాల్లో ఉన్న రాజస్తాన్ను శివమ్ దూబే (32 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్లు), రాహుల్ తెవాటియా (23 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్స్లు) తమ వీరోచిత పోరాటంతో జట్టుకు భారీ స్కోరును అందించారు.
178 పరుగుల ఛేజింగ్లో ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ అజేయ శతకం (52 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్స్లు)తో కదం తొక్కగా... కెప్టెన్ విరాట్ కోహ్లి (47 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అతడికి సహకరించాడు. దాంతో బెంగళూరు 16.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 181 పరుగులు చేసి అలవోకగా గెలిచింది.