ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా బౌలర్లు దుమ్మురేపారు. కుల్దీప్ యాదవ్(4/30) నాలుగు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు కుప్పకూలింది. సహిబ్జాద ఫర్హాన్(38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఫకార్ జమాన్(35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 46) తృటిలో అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు. మిగతా బ్యాటర్లలో సైమ్ అయుబ్(14) మినహా మరే బ్యాటర్ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. కుల్దీప్ యాదవ్తో పాటు వరుణ్ చక్రవర్తీ(2/30), అక్షర్ పటేల్(2/26), జస్ప్రీత్ బుమ్రా(2/25) రెండేసి వికెట్లు తీసారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు సహిబ్జాదా ఫర్హాన్, ఫకార్ జమాన్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాపై ఎదురు దాడికి దిగారు. వరుణ్ చక్రవర్తీ కట్టడి చేయడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి పాకిస్థాన్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. అనంతరం ఫర్హాన్ మరింత దూకుడుగా ఆడాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ బౌలింగ్లో భారీ సిక్స్లు బాదాడు. ఈ క్రమంలో అతను 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

వరుణ్ చక్రవర్తీ బౌలింగ్లో సిక్స్ బాదిన ఫర్హాన్ మరుసటి బంతికే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి సైమ్ అయుబ్ రాగా.. ఫకార్ జమాన్ దూకుడుగా ఆడాడు. సైమ్ అయుబ్ కూడా బౌండరీలు బాదడంతో పాకిస్థాన్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. సైమ్ అయుబ్(14)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయడంతో రెండో వికెట్కు నమోదైన 29 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత పాకిస్థాన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.
మరుసటి ఓవర్లోనే మహమ్మద్ హరిస్(0)ను అక్షర్ పటేల్ క్యాచ్ ఔట్ చేయగా.. హాఫ్ సెంచరీకి చేరువైన ఫకార్ జమాన్ను వరుణ్ చక్రవర్తీ పెవిలియన్ చేర్చాడు. హుస్సైన్ తలత్(1)ను అక్షర్ పటేల్ ఔట్ చేయగా సల్మాన్ అలీ అఘా(8)ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. ఇదే ఓవర్ ఆఖరి బంతికి షాహిన్ అఫ్రిది(0) కుల్దీప్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. 30 పరుగుల వ్యవధిలోనే పాకిస్థాన్ 7 వికెట్లు కోల్పోయింది. హరీస్ రౌఫ్(6), మహమ్మద్ నవాజ్(6) వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చి పాకిస్థాన్ ఇన్నింగ్స్కు తెరదించాడు.